BRS MLA Malla Reddy : డీకే శివకుమార్ ను కలిసిన మల్లారెడ్డి..! ‘కారు’ దిగబోతున్నారా...?
14 March 2024, 15:19 IST
- BRS MLA Malla Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి… కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను కలిశారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతానే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
డీకేతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
BRS MLA Malla Reddy Meet DK Shivakumar: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి సరికొత్త జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ... మెజార్టీ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలువురు మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకుంటుండగా... ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.... కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్(DK Shivakumar) ను కలవటం ఆసక్తికరంగా మారింది.
మల్లారెడ్డి(BRS MLA Malla Reddy)తో పాటు ఆయన కుమారుడు.... డీకే శివ కుమార్ ను బెంగళూరులో కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో కూడా బయటికి వచ్చింది. దీంతో ఆయన పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. అయితే రేపోమాపో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని సమాచారం. ఆ తర్వాత చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే మల్లారెడ్డికి చెందిన పలు భవాలను కూల్చింది రెవెన్యూ యంత్రాంగం. అదే రోజు వెంటనే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు సమావేశమయ్యారు మల్లారెడ్డి. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే మరునాడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు మల్లారెడ్డి. పార్టీ మారటం లేదని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి.
వేం నరేందర్ రెడ్డిని కలవటంపై బీఆర్ఎస్ పెద్దలకు వివరణ ఇచ్చిన మల్లారెడ్డి…మరో క్లారిటీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. మొదట్నుంచిమల్కాజ్ గిరి ఎంపీ సీటు(Malkajgiri Lok Sabha constituency) తమ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన మల్లారెడ్డి…. తాజా పరిణామాలతో వెనక్కి తగ్గారు. తన కుమారుడు భద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని… మల్కాజ్ గిరి స్థానానికి భద్రారెడ్డి పేరును పరిశీలించవద్దని కేటీఆర్ కు తెలిపారని తెలిసింది. పార్టీ మారేదే లేదని చెప్పిన మల్లారెడ్డి… పోటీపై వెనక్కి తగ్గటంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు బరిలో ఉంటామని గట్టిగా చెప్పిన మల్లారెడ్డి…. ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ మారింది.
పార్టీ మారే ఉద్దేశ్యం లేదని చెప్పిన మల్లారెడ్డి…. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను కలవటం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఆయన బీఆర్ఎస్ ను వీడి… కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హస్తం గూటికే చేతురాని సమాచారం. అయితే మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన రాజశేఖర్ రెడ్డి కూడా… మల్లారెడ్డి బాటలోనే నడుస్తారా..? లేక పార్టీలోనే కొనసాగుతారా…? వంటి ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.