NPK fertiliser subsidy: రబీ సీజన్ కు ఎరువుల సబ్సీడీ ప్రకటించిన కేంద్రం
Published Oct 25, 2023 05:28 PM IST
- NPK fertiliser subsidy: 2023-24 సంవత్సరంలో రబీ సీజన్ కోసం రైతులకు అందించే ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సడీకి బుధవారం కేంద్రం ఆమోదం తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
NPK fertiliser subsidy: ఈ రబీ సీజన్ లో రైతులకు రూ. 22,303 కోట్ల మేర ఎరువుల సబ్సీడీని కేంద్రం అందిస్తోంది. ఈ ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఎరువుల్లో పాస్ఫరస్, పొటాషియం (PK), నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (NPK) ఎరువులపై పోషకాధారిత సబ్సీడీ ఎన్బీఎస్ (nutrient-based subsidy NBS) ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో ఈ పోషకాల ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులకు అందుబాటు ధరల్లో ఈ ఎరువులను అందిస్తున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను బుధవారం సాయంత్రం ఆయన వెల్లడించారు.
రెండు ప్రయోజనాలు..
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. చవకగా, అందుబాటు ధరలో రైతులకు అవసరమైన ఎరువులు లభ్యం కావడం ఒక ప్రయోజనమని చెప్పారు. పొటాషియం, పాస్ఫరస్ ఎరువలకు ఇచ్చే సబ్సీడీలో నియంత్రణ ఉండడం వల్ల అనవసర అధిక వినియోగం ఉండకపోవడం మరో ప్రయోజనమని వివరించారు.
ఇవే ధరలు..
ఈ రబీ సీజన్ లో రైతులు నైట్రోజన్ ఎరువును కేజీ కి రూ. 47.02 కి పొందుతారు. అలాగే, ఫాస్పరస్ ఎరువును కేజీకి రూ. 20.82 లకు, పొటాషియం ఎరువును కేజీకి రూ. 2.38 లకు పొందుతారు. 2023-24 సంవత్సర ఖరీఫ్ సీజన్ లో ఎరువుల సబ్సీడీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 30 వేల కోట్లను కేటాయించింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలతో ముగిసింది. పోషకాధారిత సబ్సీడీ ఎన్బీఎస్ (nutrient-based subsidy NBS) కార్యక్రమాన్ని 2010 లో ప్రారంభించారు. రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు, ఇతర పంట పోషకాలను అందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.