Cabinet approves 51,875 cr subsidy: రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు లభించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం రబీ సీజన్ లో నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం ఎరువుల సబ్సీడీ కోసం రూ. 51,875 కోట్ల ను కేంద్రం కేటాయించింది.
భూ సారం పెంచే ఎరువులైన నైట్రోజన్, పొటాష్, పాస్ఫరస్ లు రైతులకు అత్యంత అవసరమైన ఎరువులు. వాటిని రైతులకు అందుబాటు ధరల్లో అందించడానికి ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(Cabinet Committee on Economic Affairs - CCEA) బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై, ఈ రబీ సీజన్ లో నైట్రోజన్, పొటాషియం, పాస్ఫరస్ ఎరువుల సబ్సీడీపై నిర్ణయం తీసుకుంది.
ఈ రబీ సీజన్ లో నైట్రోజన్(nitrogen N) పై కేజీకి రూ. 98.02, పాస్ఫరస్(phosphorus P) పై కేజీకి రూ. ₹66.93, పొటాష్(potash K) పై కేజీకి రూ. 23.65, సల్ఫర్(sulphur S) పై కేజీకి రూ. 6.12 సబ్సీడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రబీ సీజన్ సబ్సీడీ మొత్తంగా రూ. 51,875 కోట్లుగా నిర్ధారించారు. ఈ ఎరువులపై ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం రూ. 60,939 కోట్ల సబ్సీడీ ఇచ్చింది. ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లకు ప్రకటించే సబ్సీడీని ఆయా ఎరువుల కంపెనీలకు అందిస్తుంది. తద్వారా, సబ్సీడీ ధరలకు ఆయా ఎరువులను కంపెనీలు రైతులకు అందిస్తాయి.