తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air Pollution Deaths : భారతదేశంలో 7 శాతం మరణాలు వాయు కాలుష్యంతోనే.. అందులో హైదరాబాద్ కూడా

Air Pollution Deaths : భారతదేశంలో 7 శాతం మరణాలు వాయు కాలుష్యంతోనే.. అందులో హైదరాబాద్ కూడా

Anand Sai HT Telugu

Published Jul 04, 2024 09:00 AM IST

google News
    • Air Pollution Deaths In India : భారతదేశంలోని 10 అతిపెద్ద నగరాల్లో సంభవించే మొత్తం మరణాలలో ఏడు శాతానికి పైగా వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్నాయని ఒక అధ్యయనం తెలిపింది. హైదరాబాద్ నగరం కూడా ఈ లిస్టులో ఉంది.
వాయు కాలుష్యంతో సమస్యలు (Hindustan Times)

వాయు కాలుష్యంతో సమస్యలు

రాజధాని దిల్లీతో సహా వాయు కాలుష్యంతో నిండిన భారతీయ నగరాలు చాలా ఉన్నాయి. వాయు కాలుష్యంతో బాధపడుతున్నాయి. ఇక్కడ నివాసితుల ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పును ఇప్పటికీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇప్పుడే అర్థం చేసుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


కొత్త అధ్యయనం ప్రకారం.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే, సిమ్లా, వారణాసి నగరాల్లో PM2.5 కాలుష్య కారకాలుగా పిలువబడే క్యాన్సర్‌కు కారణమయ్యే మైక్రోపార్టికల్స్ స్థాయిలను భారత నేతృత్వంలోని బృందం పరిశీలించింది. దీని కారణంగా ఇలాంటి నగరాల్లో వాయు కాలుష్యంతో మరణాల సంఖ్య పెరిగింది.

2008 నుండి 2019 వరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాముల సిఫార్సు కంటే ఎక్కువగా PM2.5 బహిర్గతం కావడం వల్ల సంవత్సరానికి 33,000 కంటే ఎక్కువ మరణాలు సంభవించవచ్చని అధ్యయనం తెలిపింది. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లోని అధ్యయనం ప్రకారం ఈ కాలంలో ఆ నగరాల్లో నమోదైన మరణాలలో ఇది 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

వాయు కాలుష్యంతో ఏడాదికి 12,000 మరణాలుగా అంటే మొత్తం 11.5 శాతం మరణాలతో దేశ రాజధాని దిల్లీ అత్యంత దారుణంగా ఉంది. ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాల్లో వాయు కాలుష్యం ఉండదని భావిస్తామని, కానీ ఇక్కడ కూడా మరణాల రేటు ఎక్కువగా ఉందని పరిశోధకులు నొక్కి చెప్పారు. భారత వాయు నాణ్యతా ప్రమాణాలను కఠినతరం చేయాలని పరిశోధకులు పిలుపునిచ్చారు.

దేశంలో ప్రస్తుత సిఫార్సు క్యూబిక్ మీటర్‌కు 60 మైక్రోగ్రాముల PM2.5, ఇది WHO మార్గదర్శకాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దీనిని తగ్గించడం వలన సంవత్సరానికి పదివేల మంది జీవితాలను రక్షించవచ్చు.. అని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన సహ రచయిత జోయెల్ స్క్వార్ట్జ్ చెప్పారు. 'కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతులు ఉన్నాయి. ఇతర చోట్ల ఉపయోగిస్తు్న్నారు. వాటిని భారతదేశంలో అత్యవసరంగా వర్తింపజేయాలి.' అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌ ప్రకారం దిల్లీ వంటి మెగాసిటీలకు వాయు కాలుష్యం వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు.. స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్నట్లు గతంలో భావించిన నగరాల్లో కూడా వాయు కాలుష్యం వల్ల మరణించిన వారి సంఖ్య పెరిగింది. మరణాలలో గణనీయమైన వాటా బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో నమోదైంది. ఇక్కడ గాలి నాణ్యత మధ్యస్థంగా పరిగణించబడుతుంది.

అధ్యయనం చేసిన నగరాల్లో అత్యంత స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న హిమాలయ పట్టణం సిమ్లాలో కూడా మొత్తం మరణాలలో 3.7 శాతం కాలుష్యానికి సంబంధించినవే అని అధ్యయనం కనుగొంది. వెంటనే మేల్కొనకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.