తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Opposition Letter To Pm Modi: ప్రధాని మోదీకి బీఆర్ఎస్ సహా 8 ప్రతిపక్షాల లేఖ: “దుర్వినియోగం వద్దంటూ”.. కాంగ్రెస్ మిస్

Opposition letter to PM Modi: ప్రధాని మోదీకి బీఆర్ఎస్ సహా 8 ప్రతిపక్షాల లేఖ: “దుర్వినియోగం వద్దంటూ”.. కాంగ్రెస్ మిస్

05 March 2023, 12:12 IST

    • Opposition Parties letter to PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీకి 8 రాజకీయ పార్టీలు లేఖ రాశాయి. సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయవద్దంటూ కోరారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (ANI/ PIB)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Opposition Parties letter to PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 8 ప్రతిపక్షాలు లేఖ రాశాయి. ఆమ్ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా అరెస్టుపై రాజకీయ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ 8 పార్టీలకు చెందిన 9 మంది నేతలు పీఎంకు లెటర్ పంపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల (Central Investigation Agencies)ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఏజెన్సీలను పంపుతున్నారని విమర్శించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సహా మొత్తంగా 8 పార్టీలు ఈ లేఖను రాశాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇందులో లేదు. వివరాలివే..

ఎవరు.. ఏ పార్టీలు

Opposition Parties letter to PM Narendra Modi: ప్రధాని మోదీకి రాసిన లేఖపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, పశ్చిమ బెంగాల్ సీఎం (తృణమూల్ కాంగ్రెస్) మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ (ఆప్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఆప్) సంతకాలు చేశారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్ వాదీ పార్టీ (SP) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ (RJD) కూడా ఈ లేఖలో సంతకాలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఈ లేఖకు దూరంగా ఉన్నారు.

ఇంకా ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నాం

Opposition Parties letter to PM Narendra Modi: కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై ఉసిగొలుపుతున్నారంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. “ఇండియా ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని మీరు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం. ప్రతిపక్షాల నాయకులకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం.. ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపునకు మారుతున్నట్టుగా సూచిస్తోంది” అని విపక్షాలు లేఖలో పేర్కొన్నాయి.

బీజేపీలో చేరితే కేసులు మూలకే..

Opposition Parties letter to PM Narendra Modi: వేరే పార్టీల్లో ఉన్నప్పుడు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొన్న వారు.. బీజేపీలో చేరితే ఆ తర్వాత కేసుల్లో పురోగతి ఉండడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బెంగాల్ నేత సువేందు అధికారి సహా మరికొందరిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాంగ్రెస్‍లో ఉన్నప్పుడు 2014, 2015 మధ్య శారదా చిట్ ఫండ్ స్కామ్‍లో సీబీఐ, ఈడీ విచారణను హిమంత బిశ్వ శర్మ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ప్రస్తుతం అసోం సీఎంగా ఉన్నారు.

“బీజేపీలో చేరిన తర్వాత ఆయన (హిమంత శర్మ) పై ఉన్న కేసులో పురోగతి లేదు. అలాగే పశ్చిమ బెంగాల్‍లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి, ముకుల్ రాయ్ పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు నారద స్ట్రింగ్ ఆపరేషన్ కేసులో సీబీఐ, ఈడీ వారిపై నిఘా వేసింది. అయితే వారు బీజేపీలో చేరాక కేసులో ఎలాంటి పురోగతి లేదు” అని లేఖలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.

2014 తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులు, చేసిన అరెస్టులు, సోదాలు ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనే అని లేఖలో ఆరోపించారు. అయితే నాయకులు బీజేపీలో చేరితే వారిపై ఉన్న కేసుల విచారణ పురోగతి మందగిస్తుండడం గమనించాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు.

ఆధారాల్లేకున్నా సిసోడియా అరెస్టు

Opposition Parties letter to PM Narendra Modi: సుదీర్ఘ విచారణ తర్వాత ఆధారాలు లేకున్నా ఆప్ నేత సిసోడియాను లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిందని విపక్షాలు ఈ లేఖలో ఆరోపించాయి. “సుదీర్ఘ కాలం వేట తర్వాత.. లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా అవకతవకలకు పాల్పడ్డారని ఎలాంటి ఆధారాలు లభించకపోయినా.. ఆయనను సీబీఐ అరెస్టు చేసింది” అని పీఎంకు రాసిన లేఖలో ప్రతిపక్షాలు ఆరోపించాయి.