Himachal Assembly elections : ఈ స్థానాల్లో హోరాహోరీ పోరు.. గెలుపెవరిది?
12 November 2022, 8:23 IST
Himachal Pradesh Assembly elections 2022 : హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పలు కీలక నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?
Himachal Pradesh Assembly elections 2022 : 68 స్థానాల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. 55లక్షలకుపైగా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని.. 412మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఈ క్రమంలో.. హిమాచల్ ప్రదేశ్లోని పలు కీలక నియోజకవర్గాలు, అక్కడి అభ్యర్థుల మధ్య నెలకొన్న హోరీహోరీ పోరు గురించి తెలుసుకుందాము.
సెరాజ్:- సీఎం జై రామ్ ఠాకూర్ను ఇక్కడ బరిలో దింపింది బీజేపీ. కాంగ్రెస్ తరఫున చెత్రమ్ ఠాకూర్లో పోటీలో ఉన్నారు. సీపీఐ-ఎం.. మహీందర్ రాణాను బరిలో నిలబెట్టింది.
హరోలీ:- హరోలీలో రామ్ కుమార్ని బరిలో నిలిపింది కమలదళం. కాంగ్రెస్ నుంచి ముకేశ్ అగ్నిహోత్రి పోటీలో దిగారు. ఇదే సీటు నుంచి ముకేశ్ పోటీ చేయడం ఇది 5వ సారి.
Himachal Pradesh elections live updates : నదౌన్:- నదౌన్లో విజయ్ అగ్నిహోత్రిని ఎన్నికల్లో నిలబెట్టింది బీజేపీ. కాంగ్రెస్ తరఫున పార్టీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు బరిలో ఉన్నారు.
డల్హౌజి:- ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ తరఫున ఆశా కుమార్, బీజేపీ నుంచి డీఎస్ ఠాకూర్, ఆప్ నుంచి మనీశ్ సరీన్ బరిలో నిలిచారు.
దారంగ్:- బీజేపీకి చెందిన పూరన్ చంద్ ఠాకూర్.. కాంగ్రెస్ సీనియర్ నేత కౌల్ సింగ్ ఠాకూర్, ఆప్ అభ్యర్థి సునితా ఠాకూర్లతో ఇక్కడ పోటీ పడనున్నారు.
శిమ్లా రూరల్:- మాజీ సీఎం వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్.. కాంగ్రెస్ తరఫున ఇక్కడ పోటీలో నిలిచారు. రవి మెహ్తాను బరిలో దింపింది బీజేపీ.
శిమ్లా అర్బన్:- ఇక్కడ మొత్తం నలుగురు బరిలో ఉన్నారు. బీజపీ సంజయ్ సూద్, కాంగ్రెస్ హరీశ్ జనార్థ, ఆప్ చమన్ రాకేశ్ అజ్త, సీపీఐఎం టికేందర్ సింగ్ పవార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Himachal Pradesh polling : నౌపూర్:- ఇక్కడ కొత్త అభ్యర్థి రన్వీర్ సింగ్ రంగంలోకి దింపింది బీజేపీ. కాంగ్రెస్ నేత అజయ్ మహాజన్, ఆప్ అభ్యర్థి మనీషి కుమారితో ఈయన పోటీపడుతున్నారు.
ప్రజలు ఎవరి పక్షం..?
2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యేలు సైతం విజయం సాధించారు.
అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు అభ్యర్థుల్లో కాస్త భయం ఉంటూనే ఉంటుంది!
పోలింగ్ కోసం ముమ్మర ఏర్పాట్లు..
Himachal Pradesh election date 2022 : ఇక ప్రస్తుత ఎలక్షన్ కోసం ఈసీ ముమ్మరం చర్యలు చేపట్టింది. పోలింగ్ కోసం 7,884 కేంద్రాలను ఏర్పాటు చేసింది. 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పోలింగ్ కోసం విధుల్లో మోహరించింది. ఈవీఎంలో లోపాలు లేకుండా చూసుకుంది. పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. వివిధ కేంద్రాల్లో ఈవీఎంల మాక్ పోలింగ్ ప్రక్రియ జరిగింది.
హిమాచల్ ప్రదేశ్లో మొత్తం మీద 55,92,828 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల ఓటర్లు 1.93లక్షల మంది ఉన్నారు.