Campaigning ends in Himachal: హిమాచల్ లో ముగిసిన ప్రచారం
Campaigning ends in Himachal: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రధానంగా పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ప్రచారం చేశారు.
Campaigning ends in Himachal: వాడి వేడిగా సాగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరఫున అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొన్నారు.
Campaigning ends in Himachal: శనివారం ఎన్నికలు
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ శనివారం జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మాత్రం దాదాపు నెల రోజుల అనంతరం డిసెంబర్ 8న చేపట్టనున్నారు. హిమాచల్ లో మొత్తం 68 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 43 సీట్లు సాధించి ఘనవిజయంతో అధికారంలోకి వచ్చింది. ప్రతీ ఎన్నికల్లోనూ అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయం హిమాచల్ ఓటర్లకు ఉంది. ఈ సంప్రదాయం 1982 నుంచి కొనసాగుతోంది.
Campaigning ends in Himachal: హోరాహోరీ ప్రచారం
ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లకు పెద్ద ఎత్తున హామీలు గుప్పించాయి. ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని, స్కూళ్లకు వెళ్లే బాలికలకు సైకిళ్లు, కాలేజీకి వెళ్లే యువతులకు స్కూటర్లను ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరోవైపు, 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ. 1500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అతిరథ మహారథులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన రెండు రోజులు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన గురువారం రాష్ట్రంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా ప్రచారం నిర్వహించారు.
Campaigning ends in Himachal: కాంగ్రెస్ తరఫున ప్రియాంక..
కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ప్రియాంకతో పాటు పార్టీ చీఫ్ గా ఎన్నికైన మల్లిఖార్జున్ ఖర్గే ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి చివరిరోజైన గురువారం కూడా ప్రియాంక సిర్మౌర్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రతో బిజీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. అధికారంలో ఉన్న పార్టీని ఓడించే సంప్రదాయంతో పాటు ఓటర్లలో బీజేపీ ప్రారంభించిన కొత్త పెన్షన్ పథకం పట్ల ఉన్న ఆగ్రహం కూడా తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది.