Himachal Pradesh election : హిమాచల్​లో పోలింగ్​ షురూ.. ఓటర్లు ఎవరి పక్షం!-himachal pradesh election 2022 voting begins for 68 assembly segments ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Himachal Pradesh Election 2022, Voting Begins For 68 Assembly Segments

Himachal Pradesh election : హిమాచల్​లో పోలింగ్​ షురూ.. ఓటర్లు ఎవరి పక్షం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 12, 2022 08:00 AM IST

Himachal Pradesh election 2022 : హిమాచల్​ ప్రదేశ్​లో శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. 55లక్షలకుపైగా మంది ఓటర్లు.. 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు నిర్ణయించనున్నారు.

హిమాచల్​లో ఓటింగ్​ ప్రారంభం..
హిమాచల్​లో ఓటింగ్​ ప్రారంభం.. (ANI)

Himachal Pradesh election 2022 : దేశం ఎదురుచూస్తున్న హిమాచల్​ ప్రదేశ్ అసెంబ్లీ​ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 68 నియోజకవర్గాలకు శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓటింగ్​ జరగనుంది. 55లక్షలకుపైగా మంది ఓటర్లు.. రాష్ట్రంలోని 7,884 పోలింగ్​ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 412మంది అభ్యర్థుల భవితవ్యాన్ని వీరు నిర్ణయించనున్నారు.

భారీ సంఖ్యలో తరలివెళ్లి ఓటింగ్​ ప్రక్రియలో పాల్గొనాలని.. హిమాచల్​ ప్రదేశ్​ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

పటిష్ట బందోబస్తు..

హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. 30వేలకుపైగా మంది పోలీసులను వివిధ ప్రాంతాల్లో బందోబస్తు కోసం మోహరించారు. వీరిలో 67 సీఆర్​పీఎఫ్​ బృందాలు కూడా ఉన్నాయి. 11,500 మంది రాష్ట్ర పోలీసులు సైతం విధి నిర్వహణలో ఉన్నారు. 7,884 పోలింగ్​ కేంద్రాల్లో 981 ప్రాంతాలు సున్నితమైనవిగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు.

Himachal Pradesh election live updates : ఎన్నికల కోసం ఈసీ కూడా ముమ్మర చర్యలు చేపట్టింది. పోలింగ్​ కోసం 50,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను మోహరించింది. ఈవీఎంలో లోపాలు లేకుండా చూసుకుంది. పోలింగ్​ ప్రారంభానికి కొన్ని గంటల ముందు.. వివిధ కేంద్రాల్లో ఈవీఎంల మాక్​ పోలింగ్​ ప్రక్రియ జరిగింది.

హిమాచల్​ ప్రదేశ్​లో మొత్తం మీద 55,92,828 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 28,54,945 మంది పురుషులు, 27,37,845 మంది మహిళలు ఉన్నారు. 18-19 ఏళ్ల ఓటర్లు 1.93లక్షల మంది ఉన్నారు.

బీజేపీ.. కాంగ్రెస్​.. ఆప్​..

హిమాచల్​ ప్రదేశ్​లో ఇంత కాలం ద్విముఖ పోరు నడిచింది. పోటీ అంతా బీజేపీ, కాంగ్రెస్​ మధ్యే ఉండేది. దీనికి తోడు.. హిమాచల్​ ప్రదేశ్​లో ఓ ఆనవాయితీ ఉంది! ఇక్కడ ఏ పార్టీ కూడా ఇంతకాలం వరుసగా రెండుసార్లు అధికారాన్ని దక్కించుకోలేదు. బీజేపీ, కాంగ్రెస్​లు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి.

Himachal Pradesh election Polling : ఈసారి ఆ పరిస్థితులు రావని బీజేపీ ధీమాగా ఉంది. ప్రధాని మోదీ ముఖ చిత్రంతో ఎన్నికల ప్రచారాలు నిర్వహించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేసేందుకు కీలక మార్పులు చేపట్టింది. డబుల్​ ఇంజిన్​ సర్కారుకు ఓటేయాలని పిలుపునిచ్చింది.

కాంగ్రెస్​ కూడా తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించింది. ఆనవాయితీకి ఓటు వేయాలని, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని ప్రజల్లోకి వెళ్లింది.

కానీ ఇప్పుడు.. ఆప్​ ఎంట్రీతో.. హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల సమరం త్రిముఖ పోరుగా మారిపోయింది. హిమాచల్​ ప్రదేశ్​లో తీవ్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించింది ఈ పార్టీ. ఉచితాల హామీలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. 

2017లో..

2017 హిమాచల్​ ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 43 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్​ 22 చోట్ల గెలిచింది. ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక సీపీఎం ఎమ్మెల్యేలు సైతం విజయం సాధించారు.

Himachal Pradesh assembly election 2022 : అయితే.. 20స్థానాల్లో గెలుపోటముల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఆయా స్థానాల్లో సుమారు 3వేల ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. ఈ 20 స్థానాల్లోని 6 సీట్లలో మెజారిటీ 1000, అంతకన్నా తక్కువగానే ఉండటం గమనార్హం. ఇక 34 నియోజకవర్గాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 5000, అంతకన్నా తక్కువగా ఉంది. దీని బట్టి.. హిమాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల వేడి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మరి ఆప్​తో బీజేపీకి ప్రమాదమా? లేక ముప్పు కాంగ్రెస్​ ఓటు బ్యాంకుకేనా? అన్నది.. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్​ 8తో తేలిపోతుంది.

IPL_Entry_Point