BJP Manifesto : హిమాచల్ ఎన్నికలకు బీజేపీ ‘11 హామీలు’.. ఉమ్మడి పౌర స్మృతితో పాటు మరిన్ని!
BJP Manifesto for Himachal Pradesh elections : హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం అధికార బీజేపీ.. మేనిఫెస్టోను ప్రకటించింది. ఉమ్మడి పౌర స్మృతి సహా 11 హామీలు ప్రధానంగా ఉన్నాయి.
BJP Manifesto for Himachal Pradesh elections : హిమాచల్ ప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code - UCC)ని అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు పోలింగ్ మరో వారంలో జరుగనుండగా.. మేనిఫెస్టోను బీజేపీ ఆదివారం వెల్లడించింది. సంకల్ప్ పత్ర పేరుతో దీన్ని నడ్డా ఆవిష్కరించారు. హిమాచల్ సీఎం జై రామ్ ఠాకూర్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో ఉన్నారు. ప్రధానంగా 11 హామీలతో ఈ మేనిఫెస్టోను బీజేపీ రూపొందించింది.
ఈనెల 12వ తేదీన ఒకే దశలో హిమాచల్ పోలింగ్ జరగనుంది.
Himachal Pradesh Elections BJP manifesto : బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు
- ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలు. కుల, మత, వర్గాలకు అతీతంగా వివాహం, విడాకులు, వారసత్వంతో పాటు మరిన్ని అంశాల్లో అందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడమే UCC.
- హిమ్ స్టార్టప్లో భాగంగా రూ.900కోట్ల నిధుల కేటాయింపు.
- యువతకు దశల వారిగా 8లక్షల ఉద్యోగ అవకాశాల కల్పన.
- మళ్లీ అధికారంలోకి వస్తే కొత్తగా ఐదు వైద్య కళాశాలలు. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేసేలా వైద్యశాలల రెట్టింపు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా పూర్తిస్థాయి వైద్యం అందేలా సదుపాయాలు.
- ప్రతీ గ్రామానికి పటిష్ఠమైన రహదారులు.
- రాష్ట్రంలోని ఆలయాలు, ఆధాత్మిక ప్రదేశాల్లో మౌళిక సదుపాయాల అభివృద్ధి, రవాణా మెరుగుదల కోసం శక్తి కార్యక్రమం కింద 10 సంత్సరాల్లో రూ.12,000 కోట్ల నిధుల కేటాయింపు.
- పీఎం-కిసాన్ నిధి యోజన కింద రైతులకు అందే మొత్తంపై అదనంగా మరో రూ.3వేలు. మరో 10 లక్షల మంది రైతులకు ఈ పథకం వర్తింపు.
- చట్ట ప్రకారం జుడీషియల్ కమిషన్తో వక్ఫ్ ఆస్తులపై దర్యాప్తు. అక్రమ వినియోగానికి అడ్డుకట్ట.
- ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాల్లో వ్యత్యాసం తగ్గింపు
- దేశరక్షణలో సైనికులు ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం పెంపు
- యాపిల్ తోటల పెంపకందారులపై వస్తు, సేవల పన్ను (GST)కు 12శాతం పరిమితి.
ఈ 11 హామీలను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించింది. ఇందులో ఉమ్మడి పౌరస్మృతి ముఖ్యమైనదిగా ఉంది. గుజరాత్లోనూ ఈ హమీని బీజేపీ ప్రకటించింది. ఈనెల 12వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. ఆమ్ఆద్మీ పార్టీ కూడా ఈసారి చురుగ్గా పాల్గొంటుండటంతో పోరు రసవత్తరంగా మారింది. అధికారం నిలుపుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మరోవైపు ప్రతీ ఐదేళ్లకు అధికారం మారడం సంప్రదాయంగా ఉండటంతో ఆ అంశం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.
2017 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 43 సీట్లు దక్కించుకోగా.. 22 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. మరి ఈసారి ఆప్ రాకతో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
సంబంధిత కథనం