Halloween 2022 । ఈ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లాలంటే ధైర్యం కావాలి.. మన దేశంలోనే!
31 October 2022, 19:00 IST
- Halloween 2022: కొన్ని ప్రదేశాలకు వెళ్లినపుడు చాలా వింతగా, భయంకరంగా అనిపిస్తుంది. ఒంటరిగా వెళ్లాలంటే దాదాపు అసాధ్యం. ఆ ప్రాంతంలో దెయ్యాలు, శక్తులు ఉన్నాయని నమ్ముతారు. అలాంటి కొన్ని ప్రదేశాలు ఇక్కడ అందిస్తున్నాం. కొన్నింటిని మీరు నమ్మలేరు.
Halloween 2022- most haunted places in India
Halloween 2022: దయ్యాల పండగ హాలోవీన్ గురించి ఎప్పుడైనా విన్నారా? పాశ్చాత్య దేశాలలో దీనిని ఏటా అక్టోబర్ 31న జరుపుకుంటారు. ఇప్పుడు అంతటా కాస్మోపాలిటన్ కల్చర్ విస్తరిస్తుంది కాబట్టి, మన దేశంలో కూడా పెద్ద పెద్ద నగరాలలో పెద్ద హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లలో హాలోవీన్ ఫెస్ట్ల పేరుతో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ హాలోవీన్ పండుగలో పాల్గొనేవారు అందరూ వివిధ రకాల వేషధారణలో ముస్తాబై వస్తారు. ముఖ్యంగా ఇది దయ్యాల పండగ కాబట్టి, హాలోవీన్ పార్టీ గేమ్లతో అందరూ దయ్యాల లాగా దుస్తులు, అలంకరణలతో సరదా సరదాగా జరుపుకుంటారు. ఒక హారర్ కామెడీ సినిమా చూస్తే ఎలాంటి థ్రిల్ కలుగుతుందో అలాంటి అనుభూతి ఈ పండగలో పాల్గొని పొందవచ్చు.
నిజానికి గతించిన పూర్వీకులు ఆత్మల రూపంలో ఈరోజున తమ ఇంటికి తిరిగి వస్తారని నమ్ముతారు, కాబట్టి వారితో విందు అన్నట్లుగా యూరోపియన్లు ఈ పండగను వారి సంప్రదాయాల ప్రకారం జరుపుకునే వారు, అక్కడ్నించి ఇది అమెరికాకు పాకింది. రానురానూ సంప్రదాయమైన హలోవీన్ పండగ, సరదాగా వినోదం కోసం జరుపుకునే పండగలా మారింది.
ఈ విషయం అంటుంచితే, ఈ హాలోవీన్ సందర్భంగా మన భారతదేశంలో ఉన్న భయానకమైన ప్రదేశాల గురించి ప్రస్తుతం ఇంటర్నెట్లో చర్చ జరుగుతోంది.
Haunted Places in India- భారతదేశంలోని భయానకమైన ప్రదేశాలు
మన దేశంలో కొన్ని భయానకమైన ప్రదేశాలు ఉన్నాయి, సూర్యుడు అస్తమించాక ఆ ప్రదేశాలకు వెళ్లాలంటేనే ఎవరైనా సరే జంకుతారు. హాలోవిన్ పార్టీలను హోటళ్లు, పబ్బుల్లో కాకుండా ఈ ప్రదేశాలకు వెళ్లి జరుపుకోండి. అసలైన హాలోవిన్ వైబ్లను పొందవచ్చు. అప్పుడు కామెడీ పార్టీ కాస్త, సస్పెన్స్ థ్రిల్లర్ పార్టీ అయిపోతుంది. ఆ ప్రదేశాలేవో ఇక్కడ చూడండి.
భాంఘర్ ఫోర్ట్, రాజస్థాన్
రాజస్థాన్ రాష్ట్రంలోని భాంఘర్ ఫోర్ట్ గురించి ఉత్తర భారతదేశంలో చాలా కథలు వినిపిస్తాయి. ఇది అరుంధతి సినిమాలో కనిపించేలా ఉండే ఒక దయ్యాల కోట. సూర్యాస్తమయం తర్వాత ఈ కోట దరిదాపుల్లోకి వెళ్లాలంటేనే జంకుతారు.
రామోజీ ఫిల్మ్ సిటీ, తెలంగాణ
అవును, నిజమే మన హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ కూడా భయానకమైన ప్రదేశాల జాబితాలో ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ మన దేశంలోని అతిపెద్ద ఫిల్మ్ సిటీలలో ఒకటి. అయితే ఫిల్మ్ సిటీ ఆవరణలో సూర్యాస్తమయం తర్వాత సంచరిస్తే ఏదో శక్తి తరుముతుందని చెబుతారు. అక్కడ ఉండే అద్దాలకు విచిత్రమైన గుర్తులతో పెయింట్ చేసి ఉన్నాయట. ఫిల్మ్ సిటీలో పనిచేసే లైట్మెన్లు, కార్మికులు ఆ ప్రాంతానికి వెళ్లి గాయపడినట్లు, స్త్రీల వస్త్రాలు చినిగిపోవడం జరిగిన ఉదంతాలు ఉన్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. వీలైతే ఒకసారి ఆ ప్రాంతాన్ని సందర్శించండి, అయితే పూర్తి బాధ్యత మీదే.
టన్నెల్ నెం. 33, సిమ్లా
సిమ్లాలోని 33వ సొరంగ మార్గం భారతదేశంలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. చాలా చీకటిగా ఉండే ఈ సొరంగ మార్గంలో దెయ్యం సంచరిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఈ సొరంగ మార్గానికి కల్నల్ బరోగ్ పేరు పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత ఈ సొరంగ మార్గం కిందే ఖననం చేశారు. ఆయనే ఇంకా ఇక్కడ సంచరిస్తున్నారని స్థానికులు అంటారు.
డుమాస్ బ్లాక్ సాండ్ బీచ్, గుజరాత్
సూరత్ పట్టణంలోని డుమాస్ బీచ్ ఒకప్పుడు స్మశానవాటికగా ఉండేది, ఇప్పుడు బీచ్ అయింది. అయితే సాయంత్రం వేళ ఇక్కడికి వాకింగ్ కోసం వెళ్లిన కొందరు తిరిగి రాలేదట. వింత వింత శబ్దాలు వినిపిస్తాయట. ఇదొక దెయ్యాల బీచ్.
మల్చా మహల్, ఢిల్లీ
ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న మల్చా మహల్ ఒక రహస్య ప్రదేశంగా ఉంది. ఇది తుగ్లక్ కాలం నాటి వసతి గృహం. అయితే సెప్టెంబరు 10, 1993న బేగం విలాయత్ మహల్ తన 62వ ఏట వజ్రాలు తిని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నించి ఇక్కడే ఆమె సంచరిస్తుందని నమ్ముతారు. ఈ సైట్ను సందర్శించే వారు అక్కడికి వెళ్లినప్పుడల్లా ఏదో వింత శక్తిని అనుభూతి చెందినట్లు పేర్కొన్నారు.