Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు.. ఎప్పటి నుంచంటే?
01 May 2024, 15:08 IST
- Zee Telugu New Serial: జీ తెలుగులో మరో సరికొత్త సీరియల్ రానుంది. ఈ సీరియల్ పేరు జానకి రామయ్యగారి మనవరాలు. కొత్త సీరియల్ టెలికాస్ట్ టైమ్, డేట్ ను బుధవారం (మే 1) సదరు ఛానెల్ అనౌన్స్ చేసింది.
జీ తెలుగులో సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు.. ఎప్పటి నుంచంటే?
Zee Telugu New Serial: ఇప్పటికే పలు టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్న సీరియల్స్ తో అలరిస్తున్న జీ తెలుగు ఛానెల్లో మరో కొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు జానకి రామయ్య గారి మనవరాలు. అనురాగం, ఆప్యాయతల నడుమ పెరిగి తన అభిరుచికి తగిన అమ్మాయి కోసం వెతికే అబ్బాయి, కుటుంబ బాధ్యతల్లో తలమునకలైన అమ్మాయి మధ్య సాగే అందమైన ప్రేమకథగా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
జానకి రామయ్య గారి మరవరాలు
జీ తెలుగులో ఈ సరికొత్త సీరియల్ జానకి రామయ్య గారి మనవరాలు వచ్చే సోమవారం (మే 6) నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది. ఈ సీరియల్ కథ తరతరాల నుంచి వస్తున్న మిఠాయి వ్యాపారం చేస్తున్న ఉత్తమ్ (రాజీవ్) చుట్టూ తిరుగుతుంది.
తీవ్రమైన కుటుంబ కలహాలు, బాధాకరమైన గతం కారణంగా ఉత్తమ్ నానమ్మ (ఫాతిమా బాబు), తల్లి, మేనత్త, అత్త తమ ఆశలనీ, కలలనీ ఉత్తమ్పై రుద్దుతారు. ఎంతో ఆప్యాయంగా పెంచిన ఆ నలుగురు మహిళలను తన తల్లులుగానే భావిస్తాడు ఉత్తమ్. అందరూ కలిసి ఉత్తమ్ను మంచి వ్యక్తిగా, నిజాయతీపరుడిగా పెంచుతారు. తమలాంటి విలువలున్న నిజాయతీగల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని తమ కోడలిగా చేసుకోవాలన్నది వారి కోరిక.
ఉత్తమ్ గుణవంతుడైన యువకుడిగా, ఏ అమ్మాయికైనా సరిపోయే ఆదర్శ కొడుకుగా ఎదుగుతాడు. ఉత్తమ్కి సరిపోయే అమ్మాయిని వెతకడం ప్రారంభిస్తారు అతని కుటుంబ సభ్యులు. కానీ ఉత్తమ్ కలలో ఓ పొడవాటి జుట్టు ఉన్న అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోసం వెతుకుతాడు ఉత్తమ్. కష్టపడి పనిచేసే, మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన మైథిలి (సంగీత), అందరినీ ఆకట్టుకునే మాటలతో తన దారిని తాను చక్కదిద్దుకునే నైపుణ్యం కలిగి ఉంటుంది.
పరిపూర్ణంగా ఉండాలనే విపరీతమైన ఒత్తిడి కారణంగా అణచివేతకు గురైన ఉత్తమ్.. మైథిలితో ప్రేమలో పడతాడు. మైథిలి తన తల్లి వెతుకుతున్న చక్కని అమ్మాయి అయినప్పటికీ, ఆమె కుటుంబం వారి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఉత్తమ్ తన తల్లిని ఒప్పించడానికి ఏం చేస్తాడు? కుటుంబం కోసం ఉత్తమ్ తన ప్రేమను వదులుకుంటాడా? అనేది తెలియాలంటే జీ తెలుగులో మే 6 న ప్రారంభం కానున్న జానకి రామయ్యగారి మనవరాలు సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
కుటుంబం, ప్రేమ మధ్య సాగే ఆసక్తికర కథాంశంతో సాగే జానకి రామయ్యగారి మనవరాలు జీ తెలుగు వీక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఈ సీరియల్లో రాజీవ్, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఫాతిమా బాబు, రాజశేఖర్, అర్చన, జాకీ, కల్యాణ్ ప్రసాద్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
జీ తెలుగు సీరియల్స్
జీ తెలుగు ఛానెల్లో ఇప్పటికే టాప్ టీఆర్పీ రేటింగ్స్ అందుకుంటున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి. వీటిలో పడమటి సంధ్యారాగం సీరియల్ కు అత్యుత్తమ టీఆర్పీ ఉండగా.. ఆ తర్వాత జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, త్రినయని, ప్రేమ ఎంత మధురం లాంటి సీరియల్స్ కూడా ఉన్నాయి.