Mohammed Shami: ఆ విషయంలో సరైన క్లారిటీ లేదు: భారత స్టార్ పేసర్ షమీ
09 January 2024, 17:38 IST
- Mohammed Shami: భారత టీ20 జట్టులో చోటు గురించి స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మాట్లాడారు. 2024 టీ20 ప్రపంచకప్లో ప్లేస్ దక్కాలంటే ఏది కీలకంగా మారనుందో వెల్లడించారు. ఆ వివరాలివే..
మహమ్మద్ షమీ
Mohammed Shami: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత భారత జట్టు తరఫున టీ20 ఆడలేదు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ. వన్డేలు, టెస్టుల్లో ఆడుతూ వస్తున్నారు. గతేడాది వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. టీ20ల్లో సీనియర్ పేసర్ల గైర్హాజరీలో భారత జట్టులో అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ సహా మరికొందరు యంగ్ ఫాస్ట్ బౌలర్లు చోటు దక్కించుకుంటున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ 1 నుంచి 29వ తేదీ మధ్య జరిగే టీ20 ప్రపంచకప్లో భారత పేస్ దళం ఎలా ఉంటుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపైనే మహమ్మద్ షమీ స్పందించారు.
టీ20 ప్రపంచకప్ కోసం సెలెక్టర్లు తనను పరిగణనలోకి తీసుకుంటున్నారో లేదో తనకు ఇంకా క్లారిటీ లేదని మహమ్మద్ షమీ అన్నారు. వన్డే ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్కు షమీని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఆ తర్వాత గాయమవటంతో దక్షిణాఫ్రికా పర్యటనకు అతడు దూరమయ్యారు. తదుపరి అఫ్గానిస్థాన్తో జరిగే టీ20 సిరీస్లోనూ మిస్ అయ్యారు. ఈ తరుణంలో టీ20ల కోసం తనను పట్టించుకుంటున్నారో లేదో స్పష్టత లేదని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ అన్నారు.
ఒకవేళ టీ20లు ఆడాలని టీమిండియా మేనేజ్మెంట్ అడిగితే.. తప్పకుండా ఆడతానని షమీ స్పష్టం చేశారు. “టీ20ల విషయానికి వస్తే.. చాలా సార్లు అసలు నేను సీన్లో ఉన్నానా లేదా అనే అంశం అర్థం కావడం లేదు. అయితే, టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్ ఉంది. ఫామ్లోకి వచ్చేందుకు అది మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ మేనేజ్మెంట్ నన్ను ఆడాలని (టీ20ల్లో) అడిగితే.. నేను కచ్చితంగా అందుబాటులో ఉంటాను” అని షమీ చెప్పారు.
గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో 24 వికెట్లతో మహమ్మద్ షమీ సత్తాచాటారు. ప్రపంచకప్ తర్వాత చీలమండ గాయం నుంచి అతడు కోలుకుంటన్నారు. స్వదేశంలో ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఐదు టెస్టుల సిరీస్లో షమీ ఆడేది అనుమానంగా ఉంది. ఈ సిరీస్ జనవరి 25న మొదలుకానుంది. అయితే, తొలి రెండు టెస్టులు షమీ ఆడడని, మూడో మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. అయితే, ఇంగ్లండ్తో సిరీస్కు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు తాను ప్రయత్నిస్తున్నానని షమీ చెప్పారు.
అర్జున అందుకున్న షమీ
భారత రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను మహమ్మద్ షమీ నేడు (జనవరి 9) అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు షమీ. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.
భారత్, అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్
టీమిండియా తదుపరి అఫ్గానిస్థాన్తో స్వదేశంలో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్తోనే భారత టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. రెగ్యులర్గా వన్డేలు, టెస్టులు ఆడుతున్న వారు.. 14 నెలల తర్వాత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జనవరి 11, జనవరి 14, జనవరి 17వ తేదీల్లో టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ల తర్వాత స్వదేశంలోనే ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది భారత్.
టాపిక్