Tirupati Fake Votes : తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం- పలువురు పోలీసులపై ఈసీ సస్పెన్షన్ వేటు
11 February 2024, 16:12 IST
- Tirupati Fake Votes : తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు తీసుకుంది. తిరుపతి నగర పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సై, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు చేసింది.
తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారం
Tirupati Fake Votes : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేశారన్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో పెను సంచలనం అయ్యింది. ప్రతిపక్షాలు అధికార వైసీపీ, అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేసింది. బస్సుల్లో జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు చర్యలు చేపట్టింది. ఇటీవల ఓ ఐఏఎస్ అధికారిపై వేటు వేసింది. తాజాగా పోలీసులపై ఈసీ సస్పెన్షన్ వేటు చేసింది. తిరుపతి తూర్పు, పశ్చిమ సీఐలు శివప్రసాద్రెడ్డి , శివప్రసాద్ను సస్పెండ్ చేసింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్సై జయస్వాములు, హెడ్కానిస్టేబుల్ ద్వారకానాథ్రెడ్డిని సస్పెండ్ చేసింది. అదే విధంగా అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ను వీఆర్కు పంపింది. తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమయంలో నమోదైన దొంగ ఓట్ల కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. సరైన సాక్ష్యాధారాలు లేవని పోలీసులు ఈ కేసులను మూసివేశారు.
34 వేల ఎపిక్ కార్డులు డౌన్ లోడ్
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమయంలో ఒకే ఐడీ నుంచి 34 వేల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రతిపక్షాల ఫిర్యాదుతో అప్పట్లో పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. ఓటర్ ఎపిక్ కార్డులు ఉన్నప్పటికీ సమగ్ర విచారణ చేపట్టకుండా కేసును మూసివేశారని పోలీసులపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈసీ ఆదేశాలతో అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
మరో అధికారిపై వేటు
తిరుపతి ఉపఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో ఈసీ చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ఇటీవల ఓ అధికారిపై సస్పన్షన్ వేటు వేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డిని ఈసీ సస్పెండ్ చేసింది. సీఈసీ ఆదేశాలతో మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు. ఓటరు ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో చంద్రమౌళీశ్వర రెడ్డిని బాధ్యుడిగా ఈసీ గుర్తించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా చంద్రమౌళీశ్వర రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు.
ఐఏఎస్ గిరీషా సస్పెండ్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన, అనంతరం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా నియమితులైన గిరీశా ఐఏఎస్ పై ఈసీ ఇటీవల సస్పెన్షన్ వేటు వేసింది. గిరీషా లాగిన్ నుంచి 30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడీ, పాస్వర్డ్లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓ పక్షానికి కొమ్ముగాయకుండా నిష్పాక్షపతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన ఐఏఎస్పై వేటు పడింది. మొదటిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు పడింది.