తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. 9వ తేదీన కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. హైదరాబాద్ వేదికగా రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం కూడా ఆరు గ్యారెంటీల హామీలపైనే చేశారు. అంతేకాదు… సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో కూడా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చించారు. పథకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని గ్రామాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. పథకాల వర్తింపున కోసం వివరాలను సేకరించింది. వివరాలను ఆన్ లైన్ కూడా చేసింది.
ఆరు గ్యారెంటీలే కాకుండా రైతు రుణమాఫీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ సర్కార్ తీసుకుంది. ఎన్నికల హామీలో కూడా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. రు. 2 లక్షల రుణమాఫీ అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లటంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని చెప్పింది. దీంతో ఈ విషయంపై రేవంత్ సర్కార్… ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పట్టాలెక్కించింది. మరోవైపు మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది.
తమ పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ప్రజా వియోజయత్సవాలకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. అయితే ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా క్రోడీకరించి…క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులోని కొన్ని విషయాలను ఇక్కడ చూడండి….