TS Letter To KRMB : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ-telangana again letter to krmb ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Letter To Krmb : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

TS Letter To KRMB : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ

HT Telugu Desk HT Telugu
Aug 30, 2022 06:06 PM IST

Telangana Letter To KRMB : కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఆర్ఎంసీ సిఫారసుల ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ
కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ

Krishna River Management Board : ఆర్ఎంసీ సిఫారసుల ముసాయిదాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తమ అభిప్రాయాలను ముసాయిదాలో పొందుపర్చలేదని పేర్కొంది. అభిప్రాయాలు చెప్పకుండా ఆర్ఎంసీ భేటీకి వెళ్లడంలో అర్థం లేదని స్పష్టం చేసింది. ఏపీ అభిప్రాయాలు పొందుపరిచి తమవి పక్కనపెట్టడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.

'జల విద్యుదుత్పత్తి కేంద్రాలపై మా అభిప్రాయాలు పేర్కొనలేదు. వరదజలాలు, రూల్ కర్వ్స్‌పై అభిప్రాయాలు పేర్కొనలేదు. ఆర్ఎంసీ 5వ భేటీ ముందే మా అభిప్రాయాలు పొందుపరచాలి. ఆ మేరకు ముసాయిదా సవరించాలని.' అని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) కన్వీనర్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు.

ఇటీవలే కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షణ కమిటీల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశం సెప్టెంబరు రెండో తేదీన నిర్వహిస్తున్నట్లు కృష్ణా యాజమాన్య బోర్డు ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నదీ జలాల భాగస్వామ్యం, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు (ఎన్‌ఎస్‌పీ) పవర్‌హౌస్‌ల నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగాన్ని రూపొందించడం, రిజర్వాయర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడడం వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది.

శ్రీశైలం, ఎన్‌ఎస్‌పీ రిజర్వాయర్‌ల రూల్ కర్వ్‌ల రూపకల్పనకు సంబంధించి మరో కీలకమైన అంశం కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ నీటిపారుదల మరియు కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ (I&CAD) అధికారులు KRMB తదుపరి RMC సమావేశంపై ఆరా తీశారు. భేటీ సమయంలో శ్రీశైలం మరియు NSP రిజర్వాయర్‌ల నియమావళి వక్రరేఖలను రూపొందించడానికి డేటాను అందించాలని అభ్యర్థించారు.

తెలంగాణ, ఏపీ పరిధిలోని కృష్ణా బేసిన్‌లో మిగులు జలాలపై కూడా చర్చ జరగనుంది. దీనికోసం ఓ పద్ధతిని రూపొందించే అంశంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 4న జరిగిన RMC సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. I అండ్CADకి చెందిన సీనియర్ అధికారులు సమావేశంలో వివరణాత్మక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తి, ప్రాజెక్టుల రూల్ కర్వ్స్​​ తో పాటు వరద నీటి వినియోగం, సంబంధిత అంశాలపై కేఆర్‌ఎంబీ జలాశయాల పర్యవేక్షక కమిటీ సమావేశం కావల్సి ఉంది. మూడు అంశాలకు సంబంధించిన సిఫారసులతో రూపొందించిన నివేదికపై ఆర్‌ఎంసీ సమావేశంలో చర్చించాలి.

IPL_Entry_Point