కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. ఏపీలోని ఆ ప్రాజెక్టులపై ఫిర్యాదు-telangana government letters to krishna river management board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. ఏపీలోని ఆ ప్రాజెక్టులపై ఫిర్యాదు

కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. ఏపీలోని ఆ ప్రాజెక్టులపై ఫిర్యాదు

Mahendra Maheshwaram HT Telugu
Aug 13, 2022 06:54 AM IST

ts govt letters to krmb: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ లేఖలు రాసింది. గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టుల విస్తరణ పనులకు అనుమతి ఇవ్వడం తగదని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఏపీపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
ఏపీపై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

ap - telangana water disputes: ఏపీ - తెలంగాణ మధ్య నీళ్ల వివాదం తెరపైకి వస్తూనే ఉంది. గత కొంతకాలంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం.... కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పనులు చేపడుతున్నారని లేఖలో పేర్కొంది. రెండు ప్రాజెక్టుల విస్తరణ పనులకు అనుమతి ఇవ్వడం తగదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్... కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.

ఏపీ సర్కార్ చేపట్టిన అనుమతులు లేని ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ కోరింది. బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని ఆరోపించింది. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశామని తెలంగాణ....వాటికి పర్యావరణ అనుమతులు నిలుపుదల చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాయాలని గతంలోనూ విజ్ఞప్తి చేశామని గుర్తు చేసింది. రూల్ కర్వ్స్ ఖరారు కోసం తెలంగాణ ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇవ్వాలని కోరామని చెప్పింది. రూల్ కర్వ్స్ ఖరారు కోసం ఎస్‌ఆర్‌బీసీ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తదితరాల అనుమతుల వివరాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ ఇప్పటికే అనధికారికంగా భారీస్థాయిలో కృష్ణా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోందని... ఏపీ అక్రమ జల తరలింపును ఎత్తి చూపేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని లేఖలో ప్రస్తానవించింది.

గత నెల జూలైలోనూ తెలంగాణ సర్కార్... ఏపీపై ఫిర్యాదు చేస్తూ.. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు లేఖ రాసింది. ఆర్డీఎస్ కుడికాల్వ పనులను చూడాలని కోరింది. కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు కొనసాగిస్తున్నారని చెప్పింది. ఆర్డీఎస్​ కుడికాల్వ పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. బోర్డు అనుమతి లేకున్నా ఏపీ పనులు కొనసాగిస్తోందని లేఖలో ప్రస్తావించింది. బోర్డు ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారన్నారు. పనులు ఆపేలా వెంటనే ఏపీకి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.

ప్రకాశం బ్యారేజీ దిగువున నీటి నిల్వ కోసం ప్రతిపాదించిన ఆనకట్టలపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ దిగువున మరికొంత నీటిని నిల్వ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి వీల్లేదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. నదీ జలాల కేటాయింపు లేకుండా ప్రకాశం బ్యారేజీ దిగువున ఆనకట్టలు నిర్మించాలని ప్రయత్నించడం సరికాదని అభ్యంతరం తెలిపింది.

కృష్ణా జలాలపై ఆధారపడి ఏపీ ప్రభుత్వం కొత్తగా పంప్డ్‌ స్టోరేజీ స్కీమ్‌ నిర్మాణం చేపట్టడంపై కూడా తెలంగాణ అభ్యంతరం తెలిపింది. కర్నూలు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజీ స్కీం ప్రాజెక్టుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో తెలంగాణ కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. తెలంగాణ పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో మొదట తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తాగునీటి కోసం కాకుండా కృష్ణా బేసిన వెలుపల ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న పంప్డ్‌ స్టోరేజీ స్కీం ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు నీటిని కేటాయించడంపై అభ్యంతరం తెలిపింది. కేంద్రం జలసంఘం అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పంప్డ్‌ స్టోరేజీ స్కీం పథకాలను కేంద్రం పరిశీలించాలని తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌ చీఫ్ మురళీధర్‌ కృష్ణాబోర్డును కోరారు.

మొత్తంగా గత కొద్దిరోజులుగా ఏపీ తెలంగాణ మధ్య ప్రాజెక్ట్ ల నిర్మాణాలు, నీటి పంపిణీ అంశాల్లో పలు వివాదాలు తెరపైకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందట గోదావరికి భారీగా వరదలు రావటంతో భద్రాచలం మునిగిపోయింది. ఈ క్రమంలో పోలవరం ఆనకట్ట ఎత్తు తగ్గించాలని తెలంగాణ డిమాండ్ చేయటంతో.... పెద్ద వివాదానికే దారి తీసింది. ఇక ఇదే అంశంపై పోలవరం అథారిటీకి కూడా లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.

IPL_Entry_Point