Flash floods : ఆకస్మిక వరదలకు 50 మంది బలి.. భయం గుప్పిట్లో ప్రజలు!-50 dead in flash floods landslides in himachal pradesh other states top 5 updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Flash Floods : ఆకస్మిక వరదలకు 50 మంది బలి.. భయం గుప్పిట్లో ప్రజలు!

Flash floods : ఆకస్మిక వరదలకు 50 మంది బలి.. భయం గుప్పిట్లో ప్రజలు!

Sharath Chitturi HT Telugu
Aug 21, 2022 04:39 PM IST

Flash floods in India : ఆకస్మిక వరదలతో హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఒడిశాలోని 50మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది!

హిమాచల్​ ప్రదేశ్​ మండీలో పరిస్థితి..
హిమాచల్​ ప్రదేశ్​ మండీలో పరిస్థితి.. (Jai Kumar)

Flash floods in India : ఆకస్మిక వరదలతో ఉత్తర భారతం ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా.. హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఒడిశాలో ఇప్పటికే 50మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

భారీ వర్షాలతో వందలాది గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇళ్లల్లోకి వరద మట్టి చేరుకుంది. రోడ్లు జలమయమయ్యాయి. హిమాజల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో.. అనేక బ్రిడ్జులు కూలిపోయాయి.

వరదలతో ఇప్పటికే అల్లాడిపోతున్న ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) మరో షాకింగ్​ వార్తను అందించింది. మరో రెండు రోజుల పాటు.. హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Flash floods Himachal Pradesh : హిమాచల్​ ప్రదేశ్​లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఆదివారం ఐదుగురు గల్లంతయ్యారు. వీరి ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు వివరించారు.

హిమాచల్​ ప్రదేశ్​లో.. ఆకస్మిక వరదల కారణంగా శనివారం ఒక్క రోజే 22మంది మరణించారు. మొత్తం మీద మూడు రోజుల్లో 36మందిని విపత్తు బలి తీసుకుంది. వందలాది మంది.. తమ నివాసాలను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరదల నేపథ్యంలో శనివారం 13మంది గల్లంతయ్యారు. నలుగురు మరణించారు. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఒడిశాలో భారీ వర్షాలు..

ఒడిశాలో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు వీడారు. 8లక్షల మంది ప్రజలపై వర్షాల ప్రభావం పడింది. 1,20,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. అనేక ప్రాంతాల్లో.. అంతంతమాత్రంగా ఉండే మౌలికవసతులు.. ఈ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి!

Odisha rains : ఉత్తర ఒడిశాలోని అనేక నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవని తెలుస్తోంది.

ఝార్ఖండ్​ రామ్​గఢ్​ జిల్లాలో.. నల్కరి నదిలో ఐదుగురు కొట్టుకుపోయారు. శనివారం జరిగింది ఈ ఘటన. వీరిలో నలుగురి మృతదేహాలను వెలికితీశారు.

<p>ఝార్ఖండ్​ జమషెద్​పూర్​లో</p>
ఝార్ఖండ్​ జమషెద్​పూర్​లో (ANI)

కొన్ని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ తెగిపోయింది. అక్కడి ప్రరిస్థితులపై ఎవరికీ సరైన సమాచారం లేకుండా పోయింది.

ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ వేడుకుంటున్నారు. ప్రతీయేటా.. వర్షాలకు తమ జీవితాలు నాశనమవుతున్నాయని కన్నీరు పెట్టుకుంటున్నారు. వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం