Schools Reopen in Telangana: ఇవాళ్టి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11వ తేదీ నాటికి పూర్తికాగా… నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టింది.జూన్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఈ ఏడాది నుంచి ఉదయం 9గంటలకే ప్రారంభించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8 గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమయ పాలనలో పలు మార్పులు చేసింది.
మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై ప్రతిరోజు కనీసం 90శాతం మంది విద్యార్ధులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రతి నెలలో 4వ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం అరగంట పాటు పాఠ్యపుస్తకాల పఠనం, కథల పుస్తకాలు పఠనం, దినపత్రికలు, మ్యాగ్జైన్లను చదివించాలని నిర్ణయించారు. టీశాట్ టీవీ పాఠాలను ప్రసారం చేయాలి. జనవరి 10వ తేదీ నాటికి విద్యాబోధన పూర్తి చేయాలని ఆదేశించారు.