TS AP Weather : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం...! మరో 4 రోజులు భారీ వర్షాలు
Rains in Telangana: తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల దాటికి ప్రాజెక్టులకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి. ఏ మాత్రం ఆగకుండా వర్షం పడుతుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో... గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇప్పటికే జనం బయటికి రాకుండా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కీలక అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరో అల్పపీడనం..?
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ,కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు అంచనా వేసింది. ఫలితంగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిచింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీచేసింది. 1భారీ వర్షాలతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. జులై 25వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు...
శనివారం ఉదయం ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది,
శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, మేడ్చల్, మల్కాజ్ గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడకక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీలో వర్షాలు…
ఏపీలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అలాగే విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, తూగో,పగో,కోనసీమ,ప్రకాశం, అనంతపురం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
CWC అంచనా ప్రకారం ఆదివారం నుంచి వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురువారాల వరకు వరద ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వరద తగ్గుముఖం
గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.7 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.6 లక్షల క్యూసెక్కులుగా ఉండగా… పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరించింది.