TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ రాజీనామాలకు గవర్నర్ అమోదం-governor approves resignations of telangana public service commission members ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ రాజీనామాలకు గవర్నర్ అమోదం

TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ రాజీనామాలకు గవర్నర్ అమోదం

Sarath chandra.B HT Telugu

TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ఛైర్మన్‌తో పాటు పాలకమండలి సభ్యుల రాజీనామాలకు తెలంగాణ గవర్నర్ అమోదం తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజీనామాలకు గవర్నర్‌ అమోదం

TSPSC Resignations: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్థన్‌ రెడ్డితో పాటు ఇతర సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై అమోదం తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. సమీక్ష నిర్వహించిన రోజే కమిషన్ ఛైర్మన్ తన రాజీనామాను గవర్నర్‌కు అందచేశారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ చేపట్టిన గ్రూప్‌1 ప్రిలిమినరీ పరీక్షలతో పాటు కమిషన్‌ నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్‌ వ్యవహారాల్లో దర్యాప్తు కొనసాగుతున్నందున రాజీనామాలను గవర్నర్ అమోదించలేదు. ఈ వ్యవహారంపై కమిషన్‌ సభ్యుల రాజీనామాలను అమోదించాలని సిఎం రేవంత్‌ రెడ్డి గవర్నర్‌ కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు.

మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పేపర్ లీక్ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపు 105మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోదోషులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారణకు అటంకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ పాలకమండలి లేకపోవడంతో నియామకాల ప్రక్రియ నిలిచిపోవడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రభుత్వం గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు. కొత్త నోటిఫికేషన్ల విడుదలతో పాటు ఇప్పటికే చేపట్టిన నోటిఫికేషన్ల పరీక్షల నిర్వహణపై పడుతుందని వివరించడంతో పాలకమండలి రాజీనామాలకు గవర్నర్‌ అమోదించినట్టు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పాలకమండలిని ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సమూలు సంస్కరణలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీ పర్యటనలో సిఎం రేవంత్‌ రెడ్డి యూపిఎస్సీ తరహా విధానాల అమలుపై అధ్యయనం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.