CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి - కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు-cm revanth key instructions to officials on the share of krishna and godavari river waters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి - కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy : మన వాటా దక్కేలా వాదనలు వినిపించండి - కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 01, 2024 05:21 AM IST

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు ఏ మాత్రం కూడా నష్టం వాటిల్లవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రావాల్సిన వాటా దక్కించుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్రిబ్యునల్ ఎదుటు సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సూచించారు.

yearly horoscope entry point

శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో నీటి పారుదల ప్రాజెక్టులు, తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు.

రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం ఆంధ్ర, తెలంగాణల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై త్వరలోనే బ్రిజేష్‌ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించడానికి అవసరమైన సమగ్ర వివరాలను సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉందని... ఏపీలో కేవలం 30 శాతం ఉందని చెప్పారు. అదే నిష్పత్తి ప్రకారం 1005 టీఎంసీల్లో 70 శాతం నీటి వాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ కీలక సూచనలు:

  • పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నారు. అందుకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆ నీటి వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలి.
  • ట్రిబ్యునల్ నీటి వాటాల పంపిణీ పూర్తి చేసేంతవరకు కృష్ణా నది యాజమాన్యం బోర్డు, గోదావరి నది యాజమాన్యం బోర్డుల జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి.
  • వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ కోటాకు మించి ఎక్కువ నీటిని తరలిస్తుందన్న విషయంలో నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించడానికి టెలీమెట్రీ విధానం ద్వారా మానిటర్ చేయాలి.
  • నీటి వినియోగంలో అన్యాయం జరక్కుండా కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వినియోగిస్తుందన్న లెక్కలు తీయాలి.
  • శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బంకంచెర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నివా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చేయాలి.
  • సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు అవసరమైన పనులన్నీ తొందరగా చేపట్టాలి.
  • తెలంగాణ ప్రాజెక్టులు, నీటి వాటాలకు సంబంధించి అన్ని వేదికలపైనా సమర్థంగా వాదనలు వినిపించేందుకు 2014 నుంచి ఇప్పటివరకు జారీ అయిన జీవోలు, తీర్పులే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఉత్తర్వులు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అప్పటి నుంచి నీటి వాటాల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా నివేదిక తయారు చేయాలి" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం