Gavaskar Warning to Rohit: భారత్ ఈ తప్పులను అస్సలు మర్చిపోకూడదు.. రోహిత్, ద్రవిడ్‌కు గవాస్కర్ హెచ్చరిక-gavaskar says india don t forget this mistakes in 3rd odi against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar Warning To Rohit: భారత్ ఈ తప్పులను అస్సలు మర్చిపోకూడదు.. రోహిత్, ద్రవిడ్‌కు గవాస్కర్ హెచ్చరిక

Gavaskar Warning to Rohit: భారత్ ఈ తప్పులను అస్సలు మర్చిపోకూడదు.. రోహిత్, ద్రవిడ్‌కు గవాస్కర్ హెచ్చరిక

Maragani Govardhan HT Telugu
Mar 23, 2023 02:10 PM IST

Gavaskar Warning to Rohit: ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో టీమిండియా చేసిన పొరపాట్లను అస్సలు మర్చిపోకూడదని గవాస్కర్ హెచ్చరించారు. త్వరలో ఐపీఎల్ ఉన్నంత మాత్రాన తప్పులను మర్చిపోరాదని సూచించారు.

భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేపై సునీల్ గవాస్కర్ రియాక్షన్
భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేపై సునీల్ గవాస్కర్ రియాక్షన్ (AFP)

Gavaskar Warning to Rohit: చెన్నై వేదికగా బుధవారం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. 270 పరుగుల లక్ష్య ఛేదనంలో భారత్ కేవలం 248 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా సిరీస్‌ను 1-2 తేడాతో పర్యాటక జట్టుకు సమర్పించుకుంది. తాజాగా ఈ ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. త్వరలో ఐపీఎల్ ఉన్నంత మాత్రాన.. ఈ సిరీస్‌లో చేసిన తప్పులను అంత సులభంగా మర్చిపోకూడదని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు అసాధారణ ఫీల్డింగ్ వల్ల భారత బ్యాటర్లు ఒత్తిడితో షాట్లు కొట్టారని స్పష్టం చేశారు.

"ఇది సృష్టించిన ఒత్తిడి. వారికి సింగిల్స్ రాలేదు. బౌండరీల ఊసే లేదు. ఇలాంటి సమయంలో అలవాటు లేని ఆటను ఆడేందుకు ప్రయత్నించాలి. ఈ విషయాన్ని నిశింతగా పరిశీలించాలి. అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభం కానుంది. కావున ఈ పొరపాట్లను మర్చిపోయేలా చేస్తుంది. అయితే అది జరగకూడదు. ఎందుకంటే ప్రపంచకప్‌లో మనం మళ్లీ ఆస్ట్రేలియాతోనే తలపడే అవకాశం ఉండొచ్చు." అని గవాస్కర్ తెలిపారు.

భారీ భాగస్వామ్యాలు నిర్మించకపోవడంపై కూడా గవాస్కర్ తన స్పందనను తెలియజేశారు. "270 లేదా 300 పరుగుల భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు.. భాగస్వామ్యాలు కూడా భారీగానే ఉండాలి. కనీసం 90 నుంచి 100 పరుగుల పార్టనర్షిప్ ఉండాలి. అలాంటప్పుడే లక్ష్యానికి చేరువగా ఉంటాం. కానీ ఈ మ్యాచ్‌లో అలా జరగలేదు. అయితే రెండు భాగస్వామ్యాలు నమోదైనప్పటికీ అలాంటిదే లేదా భారీ పార్టనర్షిప్ చేసి ఉంటే బాగుండేది. ఆస్ట్రేలియా ఫీల్డింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మనకు, వారికి మధ్య వ్యత్యాసం అదే. ఆసీస్ బౌలింగ్ కూడా మెరుగ్గా ఉంది." అని గవాస్కర్ అన్నారు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల లక్ష్య ఛేధనలో భారత్ తేలిపోయింది. 248 పరుగులకే పరిమితైంది. అప్పటికీ విరాట్ కోహ్లీ (54) అర్ధశతకంతో ఆకట్టుకున్నా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. చివర్లో వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ మ్యాచ్‌ను చేజార్చుకుంది భారత్. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 4 వికెట్లతో రాణించి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

WhatsApp channel