Nitish kumar tries to touch the feet of an IAS officer: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, అక్కడున్న ఒక ఐఏఎస్ అధికారి కాళ్లను తాకేందుకు ప్రయత్నించారు. చేతులు జోడించి, ఆ అధికారిని వేడుకున్నారు. “కహియే తో హమ్ ఆప్కా పేర్ చు లెన్ (కావాలంటే నేను మీ కాళ్లు మొక్కుతాను)” అని రెండడుగులు ముందుకు వేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది..?
పట్నాలో బుధవారం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఒక ఐఏఎస్ అధికారితో పట్నాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. పట్నాలోని కంగన్ ఘాట్ వరకు జేపీ గంగా పథ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయనను కోరారు. “కహియే తో హమ్ ఆప్కా పేర్ చు లేన్ (కావాలంటే నేను మీ కాళ్లు మొక్కుతాను)” అంటూ చేతులు జోడించి, ఆ అధికారి వద్దకు వెళ్లడానికి లేచి నిలబడ్డాడు. నితీశ్ మాటలతో అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆ అధికారి ‘‘సార్, దయచేసి ఇలా చేయకండి' అంటూ పలు అడుగులు వెనక్కి వేశారు. అనంతరం ఆ అధికారి వివరణ ఇవ్వడానికిి ప్రయత్నించగా, సీఎం నితీశ్ అడ్డుకుని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయనను కోరారు.
పట్నా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గంగానది పక్కగా "జేపీ గంగా పథ్" అనే ఎక్స్ ప్రెస్ వే ను బుధవారం ప్రజలకు అంకితం చేసిన కార్యక్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ (nitish kumar) పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలోనే ఈ సంఘటన జరిగింది. అయితే, ఈ ఎక్స్ ప్రెస్ వే ను కంగన్ ఘాట్ వరకు విస్తరించే పనులను త్వరగా ప్రారంభించాలని సీఎం సంబంధిత అధికారిని కోరారు. ఈ కార్యక్రమంలో బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.
టాపిక్