Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే-these are the food combinations that should not be eaten according to ayurveda ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

Haritha Chappa HT Telugu
Published May 15, 2024 12:34 PM IST

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా చెడు ఆహార కాంబినేషన్ ఏమిటో తెలుసుకోండి. వీటిని తినకుండా జాగ్రత్త పడండి.

ఈ ఫుడ్ కాంబినేషన్లు తినకూడదు
ఈ ఫుడ్ కాంబినేషన్లు తినకూడదు (Pinterest)

జీర్ణ సమస్యలు, చర్మ అలెర్జీలు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవారు కొన్ని రకాల ఆహార కాంబినేషన్లకు దూరంగా ఉండమని చెబుతోంది ఆయుర్వేదం. ఆయుర్వేదం ప్రకారం, మీరు తినే ఆహారం మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికీ, మీ శరీరానికి అవసరమైనవన్నీ మీ భోజనంలో కచ్చితంగా ఉండాలి. కొంతమంది తెలియక తినకూడని ఆహారాలను కలిపి తింటూ ఉంటారు. వీటిని ఆయుర్వేదం ప్రకారం 'విరుద్ధ ఆహార్' అంటారు. దీని వల్ల శరీరంలో టాక్సిన్స్, జీవక్రియ వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.

కొన్ని ఆహారాలు కలిపి తినడం వల్ల అవి ఎక్కువ పోషకాలు అందిస్తాయి. ఒకదానికొకటి పోషకాహార శోషణకు సహకరించుకుంటాయి. పప్పులో నిమ్మకాయ లేదా చపాతీ పైన నెయ్యి వేయడం మంచి ఫుడ్ కాంబినేషన్లకు ఉదాహరణలు. అలాగే తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఉన్నాయి. వాటిల్లో పాలకూర, పనీర్ లేదా ఖర్జూరం, పాల కలయిక గురించి ఆయుర్వేదం తినకూడదని చెబుతోంది.

పాలక్ పనీర్ ఎంతో మందికి ఇష్టమైన వంటలలో ఒకటి. కానీ పనీర్లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల పాలక్ నుండి ఇనుము శోషణకు అడ్డుకుంటుంది. మీరు తినే ఆహారంలో పోషకాలను శరీరం శోషించుకోకుండా తగ్గిస్తుంది. లెమన్ హనీ టీ కూడా మంచిది కాదు. ఎందుకంటే వేడి నీటిలో తేనె వేయడం వల్ల ‘అమా’ ఉత్పత్తికి దారితీస్తుంది. అలాగే గులాబ్ జామూన్ తో ఐస్క్రీమ్ కలిపి తినకూడదు. ఆ రెండింటినీ కలిపి తింటే ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

చెడు ఫుడ్ కాంబినేషన్లు ఇవే..

1. పండ్లు - పాలు: ఆయుర్వేదం ప్రకారం పండ్లు, పాలు కలిపి తినకూడదు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ కలయిక పొట్టలో పులిసిపోవడానికి కారణం అవుతుంది. ఇది కొంతమందికి ఉబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది. మామిడి పండ్లను మాత్రమే పాలతో తినవచ్చు, అతి తీపి మామిడి పండును ఎంచుకోవచ్చు.

2. పాలక్ - పనీర్: పాలకూర, పనీర్… రెండూ పోషకాహారాలే. కానీ ఈ రెండింటినీ కలిపి తినకూడదు. పనీర్లో ఉన్న కాల్షియం, పాల కూరలోని ఇనుమును శరీరం శోషించుకోకుండా ఆటంకం కలిగిస్తుంది.

3. తేనె - వేడి నీరు: తేనెను వేడి చేయడం వల్ల అందులో ప్రయోజనకరమైన ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. వేడి నీటిలో తేనెను కలపడం వల్ల ఆయుర్వేదం ప్రకారం హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. దాని ఆరోగ్య ప్రయోజనాలను కాపాడటానికి తేనెను గోరువెచ్చని లేదా గది ఉష్ణోగ్రత నీటిలో తినాలని ఆయుర్వేదం చెబుతోంది.

4. ఖర్జూరం - పాలు: కాల్షియం అధికంగా ఉండే పాలను ఖర్జూరంతో కలిపి తింటే పోషకాలు శరీరానికి అందవు. పాల నుండి వచ్చే కాల్షియం, ఖర్జూరాల నుండి వచ్చే ఇనుమును గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది భోజనం నుండి మొత్తం ఇనుము తీసుకోవడం తగ్గిస్తుంది. ముఖ్యంగా, రక్తహీనత సమస్యతో ఉంటే, ఈ కలయిక ఇనుము శోషణకు ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల తీవ్రమైన అలసట వస్తుంది.

5. ఐస్ క్రీం - గులాబ్ జామూన్: వేడి, చల్లని ఆహారం కలిపి తినడం మంచిది కాదు. వేడి ఆహారాన్ని తినేటప్పుడు, జీర్ణక్రియకు సహాయపడటానికి వేడిని తొలగించేందుకు మీ శరీరం పొట్టకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, చల్లని ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. పొట్టలోని రక్త నాళాల సంకోచానికి కారణమవుతాయి. ఈ రెండింటి కలయిక ఉబ్బరం, వాయువు, అసౌకర్యానికి దారితీస్తుంది.

6. భోజనంతో టీ: టీలో టానిన్లు, కెఫిన్ వంటి యాంటీన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇది శరీరంలో ఇనుము, కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ తో టీ తీసుకోకండి.

7. పాలు - చేపలు: ఆయుర్వేదం ప్రకారం, పాలు, చేపలు విరుద్ధ ఆహార్ జాబితాలోకి వస్తాయి. ఈ రెండూ కలిపి తింటే శరీరంలో హానికరమైన టాక్సిన్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

Whats_app_banner