Biyyampindi Vadiyalu: మండే ఎండల్లో బియ్యం పిండి వడియాలు పెట్టేయండి, సాంబార్కు జతగా అదిరిపోతాయి
Biyyampindi Vadiyalu: ఈ కాలంలో వడియాలు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు, గ్రామాల్లోనే వడియాలను పెట్టుకునే వారు ఎక్కువగా ఉన్నారు. అయితే బియ్యప్పిండి వడియాలను ఎవరైనా సులువుగా పెట్టొచ్చు. దీని రెసిపీ చాలా ఈజీ.
Biyyampindi Vadiyalu: వడియాలు పెట్టడానికి సరైన సమయం వేసవి. మండే ఎండల్లో వడియాలు ఒక్కరోజులోనే ఎండిపోతాయి. మహా అయితే రెండు రోజులు... అంతకుమించి పెద్దగా సమయం పట్టదు. ఎండలు మొదలైపోయాయి కాబట్టి వడియాలు పెట్టడం ఇప్పటికే ఎంతోమంది ప్రారంభించేసి ఉంటారు. ఆధునిక కాలంలో వడియాలను కొనే వారి సంఖ్య పెరిగిపోయింది. నిజానికి వీటిని చాలా సులువుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము బియ్యప్పిండి వడియాలు ఎలా పెట్టాలో చెప్పాము. దీని రెసిపీ చాలా సులువు. ఎవరైనా వీటిని పెట్టుకోవచ్చు.
బియ్యప్పిండి వడియాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - రెండు కప్పులు
సగ్గుబియ్యం - అరకప్పు
నీళ్లు - నాలుగు కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - రెండు స్పూన్లు
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - ఎనిమిది
బియ్యప్పిండి వడియాలు రెసిపీ
1. సగ్గుబియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.
2. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో బియ్యప్పిండిని వేయాలి.
5. ఒక కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల నీరు చొప్పున పోసి నానబెట్టాలి.
6. ఇప్పుడు మందపాటి గిన్నెను స్టవ్ మీద పెట్టాలి.
7. అందులో సగ్గుబియ్యం, రెండు గ్లాసుల నీటిని పోసి ఉడికించుకోవాలి.
8. అది ఉడుకుతున్నప్పుడే మిక్సీ చేసి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
9. రుచికి సరిపడా సరిపడా ఉప్పును వేసుకోవాలి.
10. సగ్గుబియ్యం మెత్తగా అయ్యి ఉడికేంతవరకు ఉంచుకోవాలి.
11. సగ్గుబియ్యం మెత్తగా అయ్యాక బియ్యంపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
12. వడియాల పిండిలాగా ఇది చిక్కగా అవుతుంది.
13. అలా అయ్యాక స్టవ్ కట్టేయాలి. దాన్ని చల్లబడే వరకు ఉంచాలి.
14. ఇప్పుడు ఒక కాటన్ చీరను పరిచి చిన్న గరిటతో వడియాల్లా పెట్టుకోవాలి.
15. వీటిని రెండు రోజులు ఎండలో బాగా ఎండితే చాలు వడియాలు రెడీ అయిపోతాయి.
15. వీటిని తీసేటప్పుడు కష్టంగా అనిపిస్తే కాస్త నీటిని చిలకరించి తీయండి. సులువుగా వచ్చేస్తాయి.
బియ్యప్పిండి వడియాలు ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా వాడుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి మీరు బియ్యప్పిండి, సగ్గుబియ్యాన్ని ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ వడియాలు పెరుగన్నంతో, సాంబార్ తో, పప్పుతో చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త స్పైసీగా కావాలనుకునే వారు పచ్చిమిర్చి తరుగును ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ బియ్యం వడియాలు బయట కొనాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. అదే ఇంట్లో అయితే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ వడియాలు రెడీ అయిపోతాయి. ఒకసారి వీటిని చేసుకొని తినండి, మీ అందరికీ నచ్చుతాయి.