India vs England Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ-india vs england 5 tests series bcci released team india schedule world test championship 2025 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

India vs England Test Series: ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

Hari Prasad S HT Telugu

India vs England Test Series: ఇంగ్లండ్ తో టీమిండియా మరో ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. వచ్చే ఏడాది జరగబోయే ఈ సిరీస్ షెడ్యూల్ ను గురువారం (ఆగస్ట్ 22) బీసీసీఐ అనౌన్స్ చేసింది. సుమారు రెండు నెలల పాటు ఆ దేశంలో ఇండియన్ టీమ్ పర్యటించనుంది.

ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ (Getty)

India vs England Test Series: ఇంగ్లండ్ గడ్డపై 17 ఏళ్లుగా ఓ టెస్ట్ సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు మరో అవకాశం దక్కనుంది. వచ్చే ఏడాది మరోసారి ఐదు టెస్టుల సిరీస్ కోసం ఆ దేశానికి వెళ్లనుంది రోహిత్ సేన. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా జరగనున్న ఈ సిరీస్ షెడ్యూల్ ను గురువారం (ఆగస్ట్ 22) బీసీసీఐ అనౌన్స్ చేసింది.

ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్ట్ సిరీస్

ఇంగ్లండ్ లో చివరిసారి టీమిండియా 2007లో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత మూడేళ్ల కిందట 2021లో సిరీస్ విజయానికి దగ్గరగా వచ్చినా.. చివరికి ఆ ఐదు టెస్టల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. అయితే రాబోయే కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఇంగ్లిష్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచేందుకు మరో అవకాశం టీమిండియాకు దక్కింది.

తాజాగా 2025లో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ మూడో వారం నుంచి ఆగస్ట్ తొలి వారం వరకు ఈ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా హెడింగ్లీ, బర్మింగ్‌హామ్, లండన్, మాంచెస్టర్ లలో మ్యాచ్ లు జరుగుతాయని తెలిపింది. జూన్ 20న మొదలయ్యే ఈ సిరీస్ ఆగస్ట్ 4న ముగుస్తుంది.

ఇండియా, ఇంగ్లండ్ ఐదు టెస్టుల షెడ్యూల్

ఇండియా vs ఇంగ్లండ్ తొలి టెస్టు: జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ క్రికెట్ గ్రౌండ్ (హెడింగ్లీ)

ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్టు: జులై 2 నుంచి 6 వరకు ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్ (బర్మింగ్‌హామ్)

ఇండియా vs ఇంగ్లండ్ మూడో టెస్టు: జులై 10 నుంచి 14 వరకు, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ (లండన్)

ఇండియా vs ఇంగ్లండ్ నాలుగో టెస్టు: జులై 23 నుంచి 27 వరకు, ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్)

ఇండియా vs ఇంగ్లండ్ ఐదో టెస్టు: జులై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు, ది ఓవల్ (లండన్)

ఈ సిరీస్ కు ముందు ఒకవేళ ఇండియా అర్హత సాధిస్తే డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా ఫైనల్లో తలపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సైకిల్లో టీమిండియానే టాప్ లో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఈ సైకిల్లో భాగంగా ఇండియా ఇంకా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్ లు ఆడాల్సి ఉంది.

ఇంగ్లండ్‌లో గత సిరీస్ ఇలా..

2007 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై తొలి సిరీస్ గెలవాలన్న లక్ష్యంతో 2021లో ఆ దేశ పర్యటనకు ఇండియా వెళ్లింది. తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇండియా 151 పరుగులతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 రన్స్ తో గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది.

అయితే నాలుగో టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఇండియా 157 రన్స్ తో గెలిచి సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే కొవిడ్ కారణంగా ఐదో టెస్ట్ వెంటనే జరగలేదు. తర్వాతి ఏడాదికి ఈ మ్యాచ్ ను వాయిదా వేయగా.. ఎడ్జ్‌బాస్టన్ లో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్లతో గెలిచి సిరీస్ ను 2-2తో సమం చేసింది. ఈసారి ఇండియాకు వచ్చిన ఇంగ్లండ్ ను 4-0తో వైట్ వాష్ చేసిన టీమిండియా.. వచ్చే ఏడాది వాళ్లగడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.