Bharat Jodo Yatra In AP : రాహుల్ జోడో యాత్ర.. ఏపీలో స్లోగన్ ఇదే
Rahul Gandhi Bharat Jodo Yatra In Andhra Pradesh : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా నినాదాన్ని పలుకుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒడిదుడుకులను చవిచూసిన ఆ పార్టీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది.
గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. చాలా మంది నాయకులు పార్టీని వీడి వైఎస్సార్సీపీ(YSRCP), టీడీపీ(TDP)లో చేరారు. కేవీపీ రామచంద్రరావు, పళ్లం రాజు, జేడీ శీలం వంటి కొద్దిమంది నేతలు మాత్రమే కాంగ్రెస్లో మిగిలారు.
APCC మాజీ చీఫ్ N రఘువీరా రెడ్డి కూడా మూడు సంవత్సరాలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం యాత్రలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో కలిసి ఉన్నారు. ప్రత్యేక హోదా అనేది APకి బలమైన సెంటిమెంట్ గా ఉంది. TDP, YSRCP రాష్ట్రానికి ఈ హోదాను తీసుకురావండో విఫలమయ్యారని నిందించుకుంటున్నాయి. సాంకేతిక కారణాల వల్ల హోదా సాధ్యం కాదని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) స్పష్టం చేసింది. వివిధ రంగాల్లో రాష్ట్రం వేగవంతమైన వృద్ధికి ప్రత్యేక హోదా దోహదపడుతుందని ఏపీ నేతలు భావిస్తున్నారు.
రాష్ట్రంలోని అనేక రంగాలకు నిధుల మద్దతు అవసరం. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి నిధులు కేటాయించకపోవడంతో అధ్వాన్నంగా తయారైంది. ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే విద్యార్థులకు చాలా తక్కువ కోర్సులు అందిస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్(Congress) హయాంలో విశాఖపట్నంలో రైల్వే జోన్(Visakhapatnam Railway Zone) కూడా ప్రకటించారు. గడచిన ఎనిమిదేళ్ల ఎన్డీయే పాలనలో ఇలాంటి అనేక హామీలు మరిచిపోయారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) వీటిని హైలైట్ చేస్తుంది. అధికారంలోకి వస్తే.. APకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతోంది.
'అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం. . పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) ను కూడా పూర్తి చేస్తాం. కాంగ్రెస్లో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదు. కాంగ్రెస్లో తప్ప ఏ పార్టీలోనూ నేతలు అసంతృప్తి బహిరంగంగా తెలియజేయరు. అన్ని పార్టీలలో నియంతృత్వం ఉంటుంది. అందుకే ఇతర నేతలు ఎవరూ మాట్లాడలేరు.' ఇటీవల రాహుల్ గాంధీ అన్నారు.
'ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా(Special Status)పైనే మన ప్రధాని తొలి సంతకం పెడతారని.' సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఏపీకి హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉందని, రాష్ట్రాలు, ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలను కాంగ్రెస్ మాత్రమే అందించగలదని మరో నేత చింతా మోహన్ అన్నారు.