కౌలు రైతులు కాదని నిరూపించాలని జనసేన సవాలు-janasena challenges cm to prove false allegations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కౌలు రైతులు కాదని నిరూపించాలని జనసేన సవాలు

కౌలు రైతులు కాదని నిరూపించాలని జనసేన సవాలు

HT Telugu Desk HT Telugu
May 17, 2022 07:55 AM IST

రైతు పరామర్శ యాత్రల పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దత్తపుత్రుడు పర్యాటిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై జనసేన ఘాటుగా స్పందించింది. అబద్దాలు, మోసాలతో ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడింది.

కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ (ఫైల్)
కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ (ఫైల్)

రైతుల్ని మోసం చేయడంలో సి.బి.ఐ. దత్తపుత్రుడు జగన్మోహన్‌ రెడ్డిని మించిన వాళ్లు ఉండరని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. వైసీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలిపితే ప్రతి రైతుకు రూ.19,500 రావాలని, కానీ ఇస్తున్నది రూ.13,500 మాత్రమేనని ఒక్కో రైతు మీదా రూ.6 వేల రుపాయలు జగన్ ప్రభుత్వం మిగుల్చుకొంటోందని  నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

 రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న సీఎం, తాను రైతు బిడ్డను అని చెప్పుకొంటుున్నందుకు సిగ్గుపడాలన్నారు. జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ బిడ్డనే సంగతి అందరికీ తెలుసన్నారు. గణపవరంలో ముఖ్యమంత్రి హోదాలో సి.బి.ఐ. దత్తపుత్రుడిగా సీఎం చేసిన ప్రసంగం అసత్యాలతో కూడుకున్నదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే ముఖ్యమంత్రికి సమయం మొత్తం సరిపోయిందన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ యాత్రలో ప్రభుత్వం నుంచి పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారు అనడం ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యాన్ని సూచిస్తోందని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200మంది కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారని గుర్తు చేశారు. బాధితులకు జనసేన తరపున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారని ఈ 200 మంది కౌలు రైతులు కాదని జగన్మో‌హన్‌ రెడ్డి నిరూపించాలని సవాలు చేశారు. "కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకొన్నారు" అని పోలీసు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నా పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.

 జీవో 102, 43లను అనుసరించి మృతుల కుటుంబాల రూ.7 లక్షలు ఇవ్వడం లేదని మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల దగ్గరకు వెళ్ళడం లేదన్నారు. కొన్ని కుటుంబాలను త్రిసభ్య కమిటీ కూడా విచారించి వారికి కేవలం రూ.లక్ష పరిహారం ఇచ్చి సరిపెట్టారన్నారు. కౌలు రైతులు కాకపోతే అధికారులు వెళ్ళి నామమాత్రపు పరిహారం ఎందుకిస్తున్నారని నిలదీశారు. జనసేన తరపున ఆర్థిక సాయం చేసిన వారి వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తామని అప్పుడు సిబిఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకొంటారని నాదెండ్ల ప్రశ్నించారు.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్