ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నాయి. ఇదిలా ఉంటే అర్హులైన గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఉన్నప్పటికీ… కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
కొత్తగా ఓటర్ నమోదుకు నవంబరు 6వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను ఆయా మండలాల్లోని తహసీల్దారు, ఎంపీడీవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే ఓటర్లు ఫారం-18 ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను విడుదల చేస్తారు. డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది జాబితాను వెల్లడించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలి. ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలోని నివసించే గ్రాడ్యుయేట్లు తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా...ఆధార్లోని అడ్రస్ ఆధారంగా తమ ఓటును నమోదు చేసుకోవచ్చు. అధికారులు వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు దరఖాస్తుదారుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించాలి. ఓటు హక్కు నమోదు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు తూర్పు -పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదుకు కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
గ్రాడ్యూయేట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకునేవారికి… తప్పనిసరిగా డిగ్రీ ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ సైజు ఫోటో, సంబంధిత ధ్రువపత్రాలపో గెజిటెడ్ అధికారి సంతకం కూడా ఉండాలి. https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.