Chittoor Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్-heavy rains in chittoor district collector announces holidays for schools and colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్

Chittoor Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్

Chittoor Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది.

బంగాళాఖాతంలో అల్పపీడనంతో తిరుపతిలో భారీ వర్షాలు

Chittoor Rains: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన మార్పులతో తిరుమలకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని టీటీడీ అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. తిరుమల గోగర్భం, పాపవినాశనం జలశయాలు పూర్తిగా నిండటంతో నీరు ఔట్ ఫ్లో అవుతోంది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. ఉంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 12, గురువారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

అల్పపీడన ప్రభావంతో ప్రభావంతో డిసెంబర్ 15 వ తేది వరకు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మీ ప్రాంతంలో వ్యవసాయ సంబంధిత ఇతర సందేహాలు నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.

వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదని సూచించారు. కోసిన పూర్తిగా ఆరని పనలను వర్షాల నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్పవేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని అధికారులు సూచించారు.

కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.