Onions And Tomato Prices: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు కొనుగోలు చేయలేని స్థాయికి ఉల్లిపాయలు, టమాటా ధరలు చేరడంతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై టమాట, ఉల్లి విక్రయించాలని నిర్ణయించారు.
ధరలు పెరుగుదల నియంత్రించి సాధారణ ధరలకు విక్రయించే విధంగా చర్యలు చేపట్టారు. టమాటా, ఉల్లి ధరలు పెరుగుదల అంశంపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు.
రాష్ట్రంలో టమాట, ఉల్లిపాయల ధరల నియంత్రణ అంశంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి 13 జిల్లాల్లో వెంటనే రాయితీపై టమాట, ఉల్లిపాయలు విక్రయం జరపాలని ఆదేశించారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో కిలో టమాట రూ.70 నుండి రూ.75 వరకు ఉందని రైతుబజార్లలో రూ.63 గా ఉందని మంత్రి తెలిపారు. ఇక నుంచి ధరలు తగ్గే వరకు ఉల్లిపాయలు, టమాటాలను సబ్సిడీపై కిలో టమాట రూ.50 లకే విక్రయించాలని నిర్ణయించారు.
రాయలసీమ జిల్లాల్లో టమాటా ధర రూ. 50 కంటే తక్కువగానే ఉందని.. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలు కొనసాగేలా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. లాభనష్టాలను పక్కనపెట్టి ప్రజల అవసరాలకనుగుణంగా కిలో ఉల్లిపాయలను రూ.40 నుండి రూ.45 కే విక్రయించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
విజయవాడ రైతు బజార్లో ఉల్లిపాయలో కిలో రూ.55-60కు విక్రయిస్తున్నారు. టామాటా ధరలు రూ.72గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్వహించే రైతు బజార్లలో ధరలు కాస్త తక్కువగా ఉన్నా బహిరంగ మార్కెట్లలో అసాధారణ ధరల్ని విక్రయిస్తున్నారు. మేలు రకం పేరుతో టమాటా, ఉల్లిపాయలను కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు.
రైతు బజార్లలో మరోరకం దందా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. రైతు బజార్లలో విక్రయించేందుకు తీసుకొచ్చే కూరగాయల్ని బహిరంగ మార్కెట్లకు తరలిస్తుండటంతో కొరత ఏర్పడుతోంది. ఏపీలో టమాటా ప్రధానంగా మదనపల్లి నుంచి ఉల్లిపాయలు నాసిక్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి, టమాటా ధరలను నియంత్రించి సబ్సిడీ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.