16 March AP Budget Live Updates : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లైవ్ అప్డేట్స్-andhra pradesh budget telugu live news updates 16 march2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Andhra Pradesh Budget Telugu Live News Updates 16 March2023

ముఖ్యమంత్రికి బడ్జెట్ ప్రతులు అందచేస్తున్న ఆర్ధిక మంత్రి

16 March AP Budget Live Updates : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లైవ్ అప్డేట్స్

11:11 AM ISTB.S.Chandra
  • Share on Facebook
11:11 AM IST

  • ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది దాదాపు రూ.2.79లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. శాసనసభలో ఆర్ధికమంత్రి బుగ్గన, మండలిలో డిప్యూటీ సిఎం అంజాద్ బాషా ప్రవేశపెట్టారు.

Thu, 16 Mar 202311:11 AM IST

సోము విసుర్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అంకెల గారడీగా అభివర్ణించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అసెంభ్లీ సాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారని దుయ్యబట్టారు. విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తన వాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను చెప్పారని అన్నారు. ఆర్ధిక మంత్రి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాశనసభలో ఎలా చెబుతారని సోము ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనపడుతోందన్నారు.

Thu, 16 Mar 202309:13 AM IST

కేటాయింపులు ఇలా

సంక్షేమానికి పెద్దపీఠ వేసింది ఏపీ ప్రభుత్వం.  వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు, వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు కేటాయించారు.

Thu, 16 Mar 202308:49 AM IST

బడ్జెట్ పై  సీఎం జగన్ ట్వీట్…

“మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్‌ద్వారా మరో అడుగు ముందుకేశాం” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Thu, 16 Mar 202306:45 AM IST

వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాకాణి గోవర్థన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రవేశపెట్టారు. 

Thu, 16 Mar 202305:14 AM IST

2023-24 బడ్జెట్‌లో కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ 2023-24 కేటాయింపులు శాఖల వారీగా ఇలా ఉన్నాయి. 2023-2024 బడ్జెట్ అంచనా రూ.2,79,279గా ప్రకటించారు.

వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.21,434.72 కోట్లు

వైఎస్ఆర్ రైతు భరోసా రూ.4,020 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,841.64 కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు

వైయస్‌ఆర్-పీఎం బీమా యోజన రూ.1600 కోట్లు

డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు

రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు

వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు

జగనన్న చేదోడు రూ.350 కోట్లు

వైయస్‌ఆర్ వాహనమిత్ర రూ.275 కోట్లు

వైయస్‌ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు

వైయస్ఆర్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు

మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు

రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు

లా నేస్తం రూ.17 కోట్లు

జగనన్న తోడు రూ.35 కోట్లు

ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు

వైయస్‌ఆర్ కల్యాణమస్తు రూ.200 కోట్లు

వైయస్ఆర్ ఆసరా రూ.6700 కోట్లు

వైయస్ఆర్ చేయూత రూ.5000 కోట్లు

అమ్మ ఒడి రూ.6500 కోట్లు

మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు

***

ధరల స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు

వ్యవసాయ యాంత్రీకరణ రూ.12012 కోట్లు

వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ.15,882 కోట్లు

మన బడి నాడు-నేడు రూ.3,500 కోట్లు

జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు

పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ.1,166 కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు

షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు

షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు

వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు

కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు

మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు

పేదలు అందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు

రోడ్లు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు

నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్‌) రూ.11,908 కోట్లు

పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ రూ.685 కోట్లు

ఎనర్జీ రూ.6,456 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ శాఖకి రూ.3,858 కోట్లు

గడప గడపకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

 

Thu, 16 Mar 202305:07 AM IST

సుస్థిర అభివృద్ధి లక్ష్యం

గ్రామవార్డు సచివాలయాల ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 30లక్షల ఇంటి స్థలాల పంపిణీ, 44.49లక్షల మంది తల్లులకు ఆర్ధిక సాయం చేశామని చెప్పారు. సిబిఎస్‌ఈ విద్యాబోధన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వైఎస్సార్ చేయూత, నవరత్నాలు, జగనన్న తోడు, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, సామాజిక సంక్షేమ కార్పొరేషన్లు, రైతు భరోసా కేంద్రాలు సహా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు బుగ్గన చెప్పారు. 

ప్రత్యక్ష బదిలీ పథకాల్లో నాలుగేళ్లలలో లక్షా 97వేల కోట్ల రుపాయలను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు పారదర్శకంగా విడుదల చేసినట్లు చెప్పారు.2018-19లో స్థూల ఉత్పత్తిలో దేశంలో ఏపీ 22వ స్థానంలో ఉందని బుగ్గన చెప్పారు. ఏపీ అభివృద్ధి విధానాల వల్ల 2020-21నాటికి రాష్ట్రం పురోభివృద్ధిలో స్థిరమైన ధరలతో దేశంలో ఒకటో స్థానానికి చేరిందని చెప్పారు. రాష్ట్రం వృద్ధి రేటు 11.43 శాతాన్ని సాధించడానికి వీలైందన్నారు. అత్యంత క్లిష్టమైన సమయాల్లో లక్ష్యాలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వ విజయం సాధించిందని చెప్పారు.

నవరత్నాల, మ్యానిఫెస్టో పథకాల్లో భాగంగా జీవనోపాధి, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిలను చేరుకోవడానికి శ్రమిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 62శాతం ఆధారపడి ఉన్నందున వైఎస్సార్ సున్నా వడ్డీ, రైతు భరోసా కేంద్రాలు, పొలంబడి, పరికరాలపై రాయితీ, వైఎస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

భూమిని సాగుచేసే వారు అత్యంత ము‌ఖ్యమైన వారంటూ అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్‌సన్ చేసిన వ్యాఖ‌ల్ని బుగ్గన ఉటంకించారు. అమెరికా 21లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసి అతిపెద్ద దేశాన్ని ఏర్పాటు చేశాడని గుర్తు చేశారు.మనుషులంతా ఒకేలా సృష్టించబడ్డారని థామస్ జెఫర్‌సన్‌ చెప్పారనే విషయాన్ని తమ ప్రభుత్వానికి ఎప్పుడు గుర్తుంటుందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్‌ పథకాల ద్వారా రైతులకు మూడు విడతల్లో రూ.13,500 కేటాయిస్తున్నట్లు చెప్పారు.

Thu, 16 Mar 202304:54 AM IST

కొనసాగుతున్న ఏపీ బడ్జెట్

కోవిడ్ తర్వాత సుస్థిర అభివృద్ది లక్ష్యాలు, సుపరిపాలన లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్నట్లు బుగ్గన చెప్పారు.ప్రపంచ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. స్థిరమైన అభివృద్ధికి సుపరిపాలన అవసరమని బుగ్గన చెప్పారు.సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అందుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు బుగ్గన చెప్పారు.

Thu, 16 Mar 202304:46 AM IST

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ  నుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసనకు దిగడంతో  బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవానీ, అచ్చన్నాయుడు,  గోరంట్ల బుచ్చయ్య చౌదరి,  జోగేశ్వరరావు, గద్దెరామ్మోహన్, మంతెన సత్యనారాయణరాజు, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, డోల బాలవీరాంజనేయ స్వామి, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబులు సభకు అడ్డు తగలడంతో వారిని సస్పెండ్ చేయాలని సిఎం స్పీకర్‌ను కోరారు. దీంతో ఆర‌్ధిక మంత్రి తీర్మానం ప్రతిపాదించారు. తీర్మానానికి అనుగుణంగా టీడీపీ సభ్యుల్ని ఒకరోజు పాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. 

Thu, 16 Mar 202304:38 AM IST

ప్రతిపక్ష సభ్యుల్ని బయటకు పంపాలన్న సిఎం

ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రసంగం మొదలైన వెంటనే బడ్జెట్‌ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగలడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియకుండా అడ్డుతగులుతున్న ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బయటకు పంపి బడ్జెట్ కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.

 

Thu, 16 Mar 202304:37 AM IST

పేదల బడ్జెట్‌గా అభివర్ణించిన బుగ్గన

బడుగుబలహీన వర్గాలు, ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యత, ప్రేమ రాష్ట్ర బడ్జెట్‌లో కనిపిస్తుందని బుగ్గన చెప్పారు.నిరంతరం కార్యదీక్షత, విశాల దృక్పథంతో పనిచేయాలని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సూక్తులను ఉటంకిస్తూ బుగ్గన ప్రసంగం ప్రారంభించారు.

Thu, 16 Mar 202304:34 AM IST

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రతికూల పరిస్థితులు, కోవిడ్‌ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని ఆర్ధిక మంత్రి తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన చేయడానికి కార్యదర్శులు,సిబ్బంది అర్థరాత్రి వరకు పనిచేసే వారని గుర్తుచేశారు.

Thu, 16 Mar 202304:25 AM IST

అచ్చన్నాయుడి వాయిదా తీర్మానం తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్‌ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు స్పీకర్ తమ్మినేని అనుమతించారు. మరోవైపు ఏపీలో  ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై టీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. టీ విరామం అనంతరం సభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.

 

Thu, 16 Mar 202304:15 AM IST

ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా ఏపీ…టీడీపీ విమర్శ

ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఏపీ పయనిస్తోందని ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి పదిన్నర లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని, పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లే ఖర్చు పెట్టామన్నారు. మిగిలిన డబ్బు ఏమైందని ప్రశ్నించారు.  నాలుగేళ్లలో తొమ్మిది లక్షల కోట్లు పైచిలుకు అప్పులు చేశారని,  ఏపీని జగన్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Thu, 16 Mar 202304:56 AM IST

ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంపై బుగ్గన సంతోషం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా 2023-24 బడ్జెట్ ను రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రావడం సంతోషకరమన్నారు. ఆర్థిక లోటు, కోవిడ్-19 వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడం సవాలుగా తీసుకుని ముందుకువెళ్లామన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో 2023-24 బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైనట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు కీలక రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులకు పెద్దపీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా జెండర్ బేస్డ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు

Thu, 16 Mar 202303:44 AM IST

వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్ అమోదం

2023-24 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ అమోదం తెలిపింది. అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. 

Thu, 16 Mar 202303:16 AM IST

బడ్జెట్ ప్రతులకు పూజలు చేసిన ఆర్ధిక మంత్రి

సచివాలయంలోని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  బడ్జెట్ ప్రతులకు పూజలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఆర్ధిక శాఖ కార్యదర్శి. ఎన్ గుల్జార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సీఎఫ్ఎంఎస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సునీల్ తదితరులు హాజరయ్యారు. 

Thu, 16 Mar 202303:14 AM IST

అందరకీ లబ్ది చేకూర్చేలా బడ్జెట్ ఉంటుందన్న బుగ్గన

పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి బడ్జెట్‍లో కేటాయింపులు చేసినట్లు మంత్రి బుగ్గన చెప్పారు.  పేదలు, బలహీనవర్గాలకు బడ్జెట్‍లో ప్రాధాన్యత ఇచ్చామన్నారు.  విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. - ఉన్న పథకాలను బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చేలా కేటాయింపులు చేసినట్లు ఆర్ధిక  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 

Thu, 16 Mar 202303:13 AM IST

నవరత్నాలకు ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో నవరత్నాలకు ప్రాధాన్యతనిచ్చేలా రూపకల్పన చేశారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు.

Thu, 16 Mar 202303:08 AM IST

మంత్రి మండలి భేటీ

అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉదయం మంత్రి మండలి సమావేశం కానుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు.

Thu, 16 Mar 202303:07 AM IST

అన్ని వర్గాలకు ఉండేలా బడ్జెట్

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  వరుసగా ఐదోసారిఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయనుంది. నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం  బడ్జెట్‌ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. 

 

Thu, 16 Mar 202304:56 AM IST

రూ.2.79 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

 2023-24 ఆర్ధిక సంవత్సర వార్షిక  బడ్జెట్‌‌ను మరికాసేపట్లో ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.  ఉదయం 8 గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం తెలపుతారు.  మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ కు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.  మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు.  వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లకు పెద్దపీట వేయనున్నారు.