AP B.Ed Counselling : ఏపీలో ఎట్టకేలకు బీఈడీ కౌన్సెలింగ్ జరుగనుంది. హైకోర్టు ఆదేశాలతో బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 29న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో కౌన్సెలింగ్ నిర్వహరణకు ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. కౌన్సెలింగ్ కు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ఉన్నత విద్యామండలి, కన్వీనర్ గా రామ మోహన్ రావును నియమించింది. అయితే యూనివర్సిటీల నుంచి బీఈడీ కాలేజీల జాబితా ఉన్నత విద్యామండిలి ఇంకా అందాల్సి ఉంది. ఈ జాబితా నిర్ణీత సమయంలో అందితే షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు అంటున్నారు.
గత ఏడాది జులై 14న ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. నెలలు గడిచినా ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో బీఈడీ కళాశాల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో మొత్తం 411 బీఈడీ కాలేజీలు ఉండగా, 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.
ఏపీ వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్సెట్-2023 పరీక్ష జూన్ 14న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది.
దూర విద్యలో బీఈడీ చేయాలనుకునేవారికి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. 2022- 24 అకడమిక్ ఇయర్ కు సంబంధించి బీఈడీ (ODL -Open and Distance Learning) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 21వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.