HC On Dalit Bandhu: MLA సిఫార్సు అవసరం లేదు - దళిత బంధుపై హైకోర్టు కీలక ఆదేశాలు
18 November 2022, 9:27 IST
- దళితబంధు పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకంలో ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేదని స్పష్టం చేసింది. మార్గదర్శకాల మేరకు అర్హులైతే వారినే ఎంపిక చేయాలని పేర్కొంది.
దళితబంధు పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court On Dalit Bandhu Scheme: రాష్ట్రంలో పేద దళితులకు ఇస్తున్న దళిత బంధు పథకంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ పథకంలో ఎమ్మెల్యే సిఫార్సు అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం కూడదని తేల్చిచెప్పింది. లబ్ధిదారుడి అర్హత మేరకు పథకానికి ఎంపిక చేయాలని చెప్పింది. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఎమ్మెల్యేలు ఎవరని ప్రశ్నించింది.
తిరస్కరణ అంశంపై వరంగల్కు చెందిన నూతన్బాబు సహా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దళిత బంధు కోసం దరఖాస్తు చేసుకోగా... ఎమ్మెల్యే సిఫార్సు లేకుండా దరఖాస్తు స్వీకరించలేమని కలెక్టర్ తిరస్కరించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాన్ని అందజేస్తున్నారని పిటిషన్ లో ప్రస్తావించారు. ఇతరులు అర్హులైనా వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవిదేవి విచారణ చేపట్టగా... పిటిషనర్ల తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ వాదనలు వినిపించారు. ప్రజల డబ్బుతోనే పథకాలు నిర్వహణ జరుగుతోందని వాదించారు. అర్హులైన వారికి వాటిని వర్తింపజేయాల్సి ఉందన్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సిఫార్సు ఉంటే తప్ప.. దరఖాస్తులు స్వీకరించమని అధికారులు చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చాలా మంది అర్హులకు నిరాశే ఎదురవుతోంందని ప్రస్తావించారు.
వాదనలు విన్న న్యాయస్థానం... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ ఏడాది మార్చి 17న, ఏప్రిల్ 20న విడుదల చేసిన ఆదేశాలను తప్పుబడుతూ కొట్టివేసింది. పిటిషనర్ల దరఖాస్తులను ఎంపిక కమిటీకి పంపాలని ఆదేశించింది. పథకం మార్గదర్శకాల మేరకు అర్హులైతే వారిని ఎంపిక చేయాలంది. రాజకీయ నాయకుల జోక్యం లేకుండా అర్హులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
పథకమేంటి..?
హుజురాబాద్ ఉపఎన్నిక వేళ నిరుపేద దళితుల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. ఈ స్కీం కింద రూ.10 లక్షల సాయం అందిస్తారు. పైలెట్ ప్రాజెక్ట్గా ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంలోనే దళితబంధు అమలు చేయగా అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఐదు నియోజకవర్గాల్లోని ఒక్కొ మండాలన్ని ఎంపిక చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వందమందిని ఎంపిక చేస్తున్నారు. తాజాగా రెండో దశ కింద నియోజకవర్గానికి 500 ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దళిత బంధు ద్వారా ప్రభుత్వం ఇచ్చే 10లక్షలతో పవర్ ట్రిల్లర్, వరి కోత కోసే, వరి వేసే మెషిన్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలను కొనుక్కోవచ్చు. పాల డైరీ, కోళ్ల ఫారమ్, ఆయిల్ మిల్, గ్రైడింగ్ మిల్, స్టీల్, సిమెంట్, బ్రిక్ వ్యాపారాలు, ఫర్నీచర్ దుకాణాలు, క్లాత్ ఎంపోరియం, మొబైల్ దుకాణాలు, హోటళ్లు వంటి వ్యాపారం చేసుకోవచ్చు. ఆ డబ్బును మళ్లీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉండదు.