తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Formation Day : జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు- సీఎం కేసీఆర్

Telangana Formation Day : జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు- సీఎం కేసీఆర్

13 May 2023, 21:23 IST

    • Telangana Formation Day :తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ అన్నారు. 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Twitter )

సీఎం కేసీఆర్

Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో... తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాల ప్రారంభం అవుతాయి. అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం సచివాలయంలోని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

NTR Property Dispute: ఆస్తి వివాదంలో ఎన్టీఆర్, బ్యాంకు వివాదంపై హైకోర్టులో పిటిషన్‌

Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

దేశానికే రోల్ మోడల్

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..." తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2 నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రం. అయినా కూడా...ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగుతుంది. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర ఉత్తరాధి రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు"అని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఆరేళ్లలోనే ఇంతటి అభివృద్ధి

అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో అదే జరుగుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం,దూరదృష్టితో కూడిన కార్యాచరణ కొరవడిందని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దార్శనికతతో ఉందనడానికి తొమ్మిదేండ్ల అనతికాలంలో సాధించిన ప్రగతి సాక్ష్యంగా నిలిచిందని సీఎం తెలిపారు. పేరుకు తొమ్మిదేండ్లు అయినా, మొదటి సంవత్సరంతో పాటు కరోనా కాలపు రెండేండ్లు దాదాపు మూడేండ్ల కాలం వృథాగానే పోయిన నేపథ్యంలో కేవలం ఆరేండ్ల కాలంలోనే తెలంగాణ ఇంతటి అద్భుత ప్రగతిని సాధించడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ, రోజువారీ కార్యక్రమాలు

  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలను మొత్తం 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
  • హైదరాబాద్ లో జరిగే మొదటి రోజు కార్యక్రమాలను తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్వోడీలు ఉద్యోగులందరూ హాజరవుతారు.
  • అమర వీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా...మార్టియర్స్ డేగా జరుకోవాలి.
  • అమరుల స్మారక దినం సందర్భంగా...రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి విద్యుత్తు దీపాలతో వెలిగించి, గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలి. జాతీయ జెండాను ఎగరవేసి వందనం సమర్పణ చేయాలి.
  • ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేస్తారు.
  • అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డే లో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.
  • మరో ఇరవై రోజుల పాటు వరసగా ఆయా శాఖలు సాధించిన ప్రగతిని డాక్యుమెంటు రూపంలో ప్రదర్శించాలి.
  • వ్యవసాయం విద్యుత్తు.. ఇలా ప్రతీ శాఖ గురించిన డాక్యుమెంటరీని, ఆయా శాఖలకు కేటాయించబడిన రోజున, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తారు.
  • ప్రతి శాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకశంగా రికార్డు చేస్తూ అన్ని శాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంటును రూపొందించి ప్రదర్శించాలి.
  • ఆయా శాఖలు దేశానికే అదర్శంగా సాధించిన ప్రగతిని, ఈ ప్రగతిసాధించడానికి వెనక రాష్ట్ర ప్రభుత్వం పడిన కష్టాన్ని దార్శనికతను, దృక్పథాన్ని, తాత్వికంగా విశ్లేషిస్తూ డాక్యుమెంటును రూపొందించి, సినిమాహాల్లు, టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించాలి.
  • విద్యుత్తు శాఖకు కేటాయించిన రోజును పవర్ డే’ గా పరిగణిస్తూ...ఆ రోజు విద్యుత్తుశాఖ సాధించిన విజయాల గురించి డాక్యుమెంటరీ ప్రదర్శన, తదితర సమాచారంతో ఆ రోజంతా విద్యుత్తు డే గా జరుపుకుంటారు.
  • తాగునీరు సాగునీరు కు సంబంధించి, మొత్తంగా ఒకరోజును ...వాటర్ డే’ గా నిర్వహించాలి. రాష్ట్రంలో సాగునీరు తాగునీరు, జలాభివృద్ధి జరిగిన తీరు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కార్యాచరణ దృక్పథం దార్శనికత..ఎంత కష్ట పడితే ఒకనాడు తాగునీటికి తల్లడిల్లిన తెలంగాణలో నేడు అడుగడుగునా జలధారలు పరవళ్లు తొక్కుతున్నాయనే అంశాల గురించిన అవగాహనపై ఒక రోజును కేటాయించాలి.
  • రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రకాల అన్ని వర్గాల సంక్షేమాన్ని గురించిన వెల్పేర్ డే ను ప్రత్యేకంగా ఒకరోజు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా.. దళితబంధు అమలు, 125 ఫీట్ల బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ, సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టడం దగ్గరనుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా సహా పేద వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యాచరణను గురించిన సమాచారాన్ని పలు మీడియా వేదికల ద్వారా ప్రపంచానికి తెలిపేలా కార్యక్రమాలుండాలి.
  • అగ్రికలర్చర్ డే, పల్లె ..పట్టణాభివృద్ధి దినం...రూరల్ అండ్ అర్భన్ డెవలప్ మెంట్ డే’....రెవిన్యూ డే’, పరిపాలనా సంస్కరణలు, పోలీసు సంస్కరణలు తెలిపేలా ప్రత్యేక రోజు, మహిళా సాధికారతను తెలిపే దిశగా ‘వుమెన్ డే, ఇండస్ట్రీస్ ఐటీ డే, ఎడ్యుకేషన్ డే, మెడికల్ అండ్ హెల్త్ డే, ఆర్టీజాన్స్ డే (వృత్తిపనులు), గ్రీన్ డే, హాండ్లూమ్ డే, ఆర్థిక ప్రగతి గురించి, మౌలిక వసతుల అభివృధ్ధి, ఇట్లా వొక్కో శాఖకు ఒక్కోరోజును కేటాయించి... దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని గురించి ప్రపంచం అర్థం చేసుకునేలా కార్యక్రమాలుంటాయి.
  • స్వతంత్ర భారతంలో, తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధించిన దాకా సాగిన.. తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే..డాక్యుమెంటరీని రూపొందించాలి.
  • తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన, ప్రభుత్వ పాలన ప్రారంభమైన.. 2 జూన్ 2014 నుంచి నుంచి 2023 జూన్ 2 దాకా స్వయం పాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతిని గురించిన మరో డాక్యుమెంటరీని రూపొందించాలి.
  • 21 రోజుల పాటు..తెలంగాణ సంబురాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా పిండి వంటలు ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, జానపద తదితర సంగీత విభావరి, సినిమా జానపద తదితర కళాకారలతో ప్రదర్శనలు, సంగీత నృత్యం జానపదం సాంస్కృతక కార్యక్రమాలను నిర్వహించాలి.
  • గోల్కొండ కోట, భువనగిరి కోట వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్ర వ్యాప్తంగా వున్న దేవాలయాలను సుందరీకరణ చేపట్టి విద్యుత్తు కాంతులతో అలంకరించాలి. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టాలి.
  • తమ తమ ఉద్యోగ విధుల్లో ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వారికి అవార్డులు అందజేయాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఐదారు వేల మంది కళాకారులతో హైద్రాబాద్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ధూం ధాం ర్యాలీ నిర్వహిస్తారు.
  • మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవ శోభ ప్రస్పుటించేలా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా ఉత్సవాలను నిర్వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలోని ఉత్సవాల కమిటీ.. ఇందుకు సంబంధించి పలుమార్లు సమావేశమవుతూ..ఉత్సవాల విధి విధానాలను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో మరింతగా చర్చించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

తదుపరి వ్యాసం