Abdullapurmet Road Accident : రోడ్డు ప్రమాదంలో ప్రాణం వదిలిన తండ్రి - కంటతడి పెట్టించిన పసివాడి రోధన
Published May 30, 2024 02:26 PM IST
- Hyderabad Vijayawada Expressway : హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తండ్రి వెంటే ఉన్న రెండేళ్ల కుమారుడు నాన్న కోసం రోధించటం అందర్ని కంటతడి పెట్టించింది.
అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో రోడ్డు ప్రమాదం - వ్యక్తి మృతి
Hyderabad Vijayawada Expressway : పాల ప్యాకెట్ కోసం రెండేళ్ల కుమారుడితో కలిసి తండ్రి బైక్ పై వెళ్లాడు. కానీ అతని ప్రాణాలను కబళించేందుకు మృత్యువు డీసీఏం రూపంలో దూసుకొచ్చింది. బైక్ ను బలంగా కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తండ్రి మృతదేహాం పక్కనే ఉండిపోయిన రెండేళ్ల కుమారుడు… నాన్న కోసం గుక్కపెట్టి ఎడవటం అందర్నీ కంటతడి పెట్టించింది.
ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని ఇనాంగూడ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ప్యాకెట్ కోసం తండ్రి, కుమారుడు బైక్ పై వెళ్లారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై వస్తున్న డీసీఎం… వీరి బైక్ ను బలంగా ఢీకొచ్చింది.
ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్ ఉన్న చిన్నారికి గాయాలు అయ్యాయి. అయితే దిక్కుతోచనిస్థితిలో అసలు ఏం జరిగిందో తెలియక మృతదేహం పక్కనే ఏడుస్తూ రెండేళ్ల కుమారుడు కనిపించటం హృదయవిదారకంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఏపీలోని కొవ్వూరు ప్రాంతానికి చెందిన శెట్టి కనక ప్రసాద్ (35)గా గుర్తించారు.