తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ, కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు అనుమతించాలని విజ్ఞప్తి

Bandi Sanjay: రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ, కరీంనగర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ కు అనుమతించాలని విజ్ఞప్తి

HT Telugu Desk HT Telugu

Published Sep 11, 2024 10:08 AM IST

google News
    • Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు.  కరీంనగర్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఉన్న  పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. కొత్త లైన్ల నిర్మాణం, ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల హాల్టింగ్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశాలపై చర్చించారు. 
కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో బండి సంజయ్ భేటీ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి తో బండి సంజయ్ భేటీ

Bandi Sanjay: కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రైల్వే లైన్ లు, ప్రస్తుతం నడుస్తున్న రైళ్ళ హాల్టింగ్, స్టేషన్ ల ఆధునీకరణ పై చర్చించారు. రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.


కరీంనగర్– హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను బండి సంజయ్ కోరారు.

కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని, ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్ లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు.

కొత్త రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, కరీంనగర్ – వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్దికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని, జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్ ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ రైల్వే మంత్రికి బండి సంజయ్ మరో లేఖ అందజేశారు. ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్ లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని కోరారు.

ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్ ను విస్తరించాలని, సోలార్ ప్యానెళ్లను అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఝప్తి చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.