Simon Doull on Pakistan: బాబర్ ఆజం ఫ్యాన్స్ బెదిరించారు.. తిండి కూడా తినకుండా.. సైమన్ డౌల్ షాకింగ్ కామెంట్స్
13 April 2023, 14:04 IST
- Simon Doull on Pakistan: బాబర్ ఆజం ఫ్యాన్స్ బెదిరించారు.. తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నానంటూ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
సైమన్ డౌల్
Simon Doull on Pakistan: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఈ మధ్యే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. కామెంట్రీలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలవుతున్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం కేవలం రికార్డుల కోసమే ఆడతాడని ఆ మధ్య అతడు అన్నాడు. దీంతో బాబర్ అభిమానులు అతన్ని టార్గెట్ చేశారు.
వాళ్లు తనను బెదిరించారని, దీనివల్ల తాను పాకిస్థాన్ లో బయటకు వెళ్లే వీలు కూడా లేకుండా పోయిందని జియో న్యూస్ తో మాట్లాడుతూ డౌల్ చెప్పాడు. కొన్ని రోజుల పాటు తిండి కూడా తినకుండా ఉన్నానని, చివరికి ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడినట్లు అతడు చెప్పడం గమనార్హం. మానసికంగా తనను ఎంతగానో హింసించారనీ తెలిపాడు.
"పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ చెప్పాడు.
బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.