Shreyas Srinivas : అతడే ఒక సైన్యం.. సినిమా ట్రెండ్నే మార్చేసిన ‘శ్రేయాస్ శ్రీనివాస్'
12 July 2022, 11:42 IST
- Shreyas Srinivas : 'మహేష్ బాబు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. చాలా గ్రాండ్గా జరిగింది', 'మా ఎన్టీఆర్ అన్న సినిమా బ్లాక్ బస్టర్.. సక్సెస్ మీట్ ఈసారి అదిరిపోతుంది', 'పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్.. సినిమా ఈవెంట్ కళకళలాడిపోవాలి', 'ప్రభాస్ రేంజ్కి తగ్గట్టు ఈవెంట్లు ఉంటేనే ఖుష్ అవుతాము'... ఇలా సగటు సినీ ప్రేక్షకుడి నుంచి వీరాభిమానుల వరకు.. ఎదురు చూసేది సినిమా కోసం, దాని చుట్టూ జరిగే 'ఈవెంట్ల' కోసం. ఆ ఈవెంట్లు 'శ్రేయాస్ మీడియా' చేతిలో ఉంటే.. నిర్మాతలు, అభిమానులకు ప్రశాంతతే. ఒకప్పుడు ఆడియో లాంచ్ సంప్రదాయానికి నాంది పలికి, ఇప్పుడు ప్రీ రిలీజ్- సక్సెస్ మీట్ ఈవెంట్స్ను పవర్ఫుల్గా నిర్వహిస్తూ.. అందరి అంచనాలకు మించి దూసుకెళుతున్న శ్రేయాస్ మీడియా 'జర్నీ' మీకు తెలుసా? దాని వెనక ఉన్న ఓ 'కల్లూరు కుర్రోడి' సంకల్పం గురించి మీకు తెలియాల్సిందే..
శ్రేయాస్ శ్రీనివాస్
Shreyas Srinivas : ఖమ్మం జిల్లా కల్లూరు యజ్ఞనారాయణపురంలోని ఎర్ర బోయినపల్లి గ్రామం.. శ్రీనివాస్ స్వస్థలం. నాలుగేళ్లు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారు. శ్రీనివాస్కు సినిమాలంటే పిచ్చి. కానీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నవారి కష్టాలు తెలిసినవే కదా! అయినా శ్రీనివాస్ మాత్రం పట్టువదలలేదు. అవసరమైతే.. స్నేహితులతో కలిసి ఎన్ఎస్పీ రోడ్ల మీద లారీలెక్కి థియేటర్లకు వెళ్లేవారు. అలా వార్డెన్కు దొరికిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఓవైపు చదువు.. మరోవైపు సినిమాలు.. ఇలా ఇంటర్ వరకు శ్రీనివాస్ లైఫ్ సాఫీగా సాగిపోయింది.
ఇంటర్ తర్వాత డిగ్రీ కోసం హైదరాబాద్లో అడుగుపెట్టారు శ్రీనివాస్. చిక్కడపల్లి అరోరా డిగ్రీ కాలేజీలో చేరారు. అదొక కొత్త ప్రపంచంలా అనిపించింది. తెలుగు మీడియంలోనే చదువుకున్న ఆయనకు ఇంగ్లీష్ మీడియం పరిచయమైంది అక్కడే. కానీ.. జీవితంలో ఎదగడానికి భాషతో సంబంధం లేదు, మనలో టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు.
అవి డిగ్రీ సెకండ్ ఇయర్ రోజులు. జీవితంలో ఏదైనా సాధించాలన్న సంకల్పం ఈ కల్లూరు కుర్రోడిది. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే 'ఈవెంట్ మేనేజ్మెంట్.' త్యాగరాయ గాన సభలో 'జాలీ.కామ్' పేరుతో తొలిసారి ఈవెంట్ నిర్వహించారు. ఆరోరా కాలేజీ జూనియర్స్కు ఫ్రెషర్స్ పార్టీ ఈవెంట్ అది. ఆ ఈవెంట్ను కలర్ఫూల్గా తీర్చిదిద్దింది, అక్కడికి వచ్చిన వారికి మంచి అనుభూతిని కల్పించింది శ్రీనివాసే.
కెరీర్లో ప్రతిభను నమ్ముకుంటూ ముందుకెళ్లారు శ్రీనివాస్. ఒకటి నమ్మితే.. దాన్ని పూర్తిచేసేందుకు ధైర్యంతో అడుగు వేయడం ఈ కల్లూరు కుర్రోడి అలవాటు. డిగ్రీ దశలోనే ఓ యాడ్ ఏజెన్సీని స్థాపించారు. టీవీ ఛానెళ్లల్లో 'స్క్రోలింగ్' అనే స్లగ్ను ఏర్పాటు చేసి అడ్వర్టైజింగ్లో కొత్త శకానికి నాంది పలికారు. 'నీకు అనుభవం లేదు, నువ్వేం చేయగలవు? నిన్ను నమ్మి డబ్బులు పెట్టలేము,' అన్న మాటలకు.. సొంతంగా యాడ్స్ తీసి చూపించి, ప్రశంసలు అందుకున్నారు.
శ్రీనివాస్ తీసిన యాడ్స్లో 'బిగ్ సీ' యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రోజు.. సినీ నటి, నిర్మాత ఛార్మీతో కలిసి బిగ్ సీ కోసం యాడ్ తీశారు శ్రీనివాస్. ఆ యాడ్ చాలా పాప్యులర్ అయ్యింది. అప్పటి నుంచి బిగ్ సీ యాడ్లన్నీ శ్రీనివాస్వే! అలా బిగ్ సీతో విడతీయలేని స్నేహాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
కల్లూరు కుర్రోడు.. టు 'శ్రేయాస్ శ్రీనివాస్'
Shreyas media founder : హీరోలు, హీరోయిన్లకు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే అనేక సంస్థలు తమ బ్రాండ్ల ప్రమోషన్ల కోసం వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. 'అసలు వారి చుట్టూ తిరగడం ఎందుకు? మనమే వెళ్లి సినీ ఇండస్ట్రీలో కూర్చుంటే?' అన్న శ్రీనివాస్ ఆలోచనకు ప్రతిరూపమే.. 'శ్రేయాస్ మీడియా గ్రూప్ ఈవెంట్ మేనేజ్మెంట్.'
ట్రైలర్ లాంచ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పోస్ట్ రిలీజ్ సక్సెస్ పార్టీలు జోరుగా సాగుతున్న కాలం ఇది. కానీ నిన్న, మొన్నటి వరకు సినిమాకి ముందు కేవలం ఆడియో ఫంక్షన్లే ఉండేవి. అభిమానుల కోలాహలం మధ్య ఆడియో ఫంక్షన్లు జరిగేవి. 2008 ముందు వరకు కూడా లేని ఆడియో ఫంక్షన్ సంప్రదాయానికి నాంది పలికింది కూడా శ్రీనివాసే. అప్పటివరకు చిన్న బ్యానర్ల కింద, నిర్మాతల కార్యాలయాల్లో సింపుల్గా జరిగిపోయిన ఆడియో ఫంక్షన్లకు 'గ్రాండ్' లుక్ తెచ్చింది శ్రేయాస్ మీడియానే.
2008లో 'జల్సా' సినిమాతో ఆడియో లాంచ్ ఈవెంట్కు శ్రీకారం చుట్టింది శ్రేయాస్ మీడియా. నిర్మాత అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ఆ ఈవెంట్ బ్లాక్బస్టర్గా మారింది. అక్కడి నుంచి శ్రేయాస్ మీడియా వెనక్కి తిరిగి చూసుకోలేదు! జల్సా నుంచి ఇప్పటివరకు 1,800కుపైగా ఈవెంట్స్ను నిర్వహించింది. 1,200 మూవీ ప్రొమోషన్ల బాధ్యతను చేపట్టింది. అలా.. ఆ కల్లూరు కుర్రోడు.. 'శ్రేయాస్ శ్రీనివాస్'గా పేరు సంపాదించుకున్నారు.
శ్రీనివాస్ ఆలోచనకు ఉన్న పవర్ను తెలుసుకోవాలంటే.. శ్రేయాస్ మీడియా బిజినెస్ మోడల్ గురించి చెప్పుకోవాల్సిందే. బ్రాండ్ ప్రొమోట్ చేసుకునే సంస్థలు, సినిమా ప్రొమోషన్ల కోసం ఎదురుచూస్తున్న హీరో, హీరోయిన్లను 'ఈవెంట్' రూపంలో ఒక్క చోటకు చేర్చింది శ్రేయాస్ మీడియా. ఈ ఫార్మాట్ అంతకు ముందు వరకు ఎక్కడా లేదు. శ్రేయాస్ మీడియాతో అసోసియేట్ అయితే.. టీవీ, పేపర్, సోషల్ మీడియా.. ఇలా అన్నింట్లోనూ ఆ ఈవెంట్లు హిట్ అవుతాయి అన్న నమ్మకాన్ని కల్పించారు శ్రీనివాస్.
ఈవెంట్ల నిర్వహణ కోసం కొన్ని కేటగిరీలు ఉంటాయి. బడా హీరోల చిత్రాల ఈవెంట్లను శ్రేయాస్ మీడియా ఉచితంగా చేసిపెడుతుంది. ఈవెంట్కు తగ్గట్టు స్పాన్సర్లను తీసుకొస్తుంది. ఆ ఈవెంట్లకు స్పాన్సర్ చేసిన వారికి.. కొన్ని రోజుల్లోనే 10కోట్ల మందికి రీచ్ వస్తుంది. 'ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే.. అంత లాభం,' అని సాగిపోతున్న ఈ కాలంలో.. ఇంత కన్నా కావాల్సింది ఏముంటుంది? అలా కేటగిరీలు, హీరోల ఫేమ్ బట్టి.. నిర్మాతలు, స్మాన్సర్ల నుంచి డబ్బులు సేకరించి ఈవెంట్లు నిర్వహిస్తుంది శ్రేయాస్ మీడియా.
కొత్త టాలెంట్కు ప్రోత్సాహం..
Shreyas media : టాలెంట్కు గుర్తింపు లభిస్తే.. అది ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందనేది శ్రేయాస్ శ్రీనివాస్కు తెలుసు. అందుకు ఆయనే నిదర్శనం. అందుకే కొత్త టాలెంట్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 'గుడ్ సినిమా గ్రూప్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'ఈరోజుల్లో..' సినిమాతో ప్రముఖ దర్శకుడు మారుతీని పరిచయం చేశారు. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలను నిర్మించారు.
'రెగ్యులర్ ఫార్మాట్, కామెడీ, ఫ్యామిలీ చిత్రాలు ఓటీటీలో చాలా వస్తున్నాయి. ప్రజల ఆసక్తులు మారిపోయాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్ వంటి సినిమాలు క్రేజ్ని సంపాదించుకున్నాయి. అందుకే.. ఇన్నోవేటివ్ స్టోరీలు, ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఉండే స్టోరీలతో యంగ్ టాలెంట్ ముందుకొస్తే.. వాటిని నిర్మించేందుకు సిద్ధం,' అని అంటున్నారు శ్రేయాస్ శ్రీనివాస్.
కష్టపడితేనే 'సక్సెస్'..
ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు సహజమే. అదేంటో.. జీవితంలో సక్సెస్ సాధించాలన్న సంకల్పంతో ఉన్న వారిని.. కాలం ఇంకాస్త ఎక్కువే పరీక్షిస్తుంది! ఆ కష్టాలను ఎదురీదితేనే 'సక్సెస్'ను అందిస్తుంది. శ్రీనివాస్ కూడా.. తన కెరీర్లో ఎన్నో కష్టాలు చూశారు. వాటిని జయిస్తూ.. తన సక్సెస్ స్టోరీని తానే రాసుకున్నారు.
డిగ్రీ రోజుల్లో త్యాగరాయ గాన సభలో శ్రీనివాస్ నిర్వహించిన తొలి ఈవెంట్కు దాదాపు బ్రేక్ పడింది! కాసేపట్లో ఈవెంట్ అనగా.. ఒక్కసారిగా కరెంట్ పోయింది. రూ. 3వేల రెంట్ బ్యాలెన్స్ ఇస్తేనే ఈవెంట్ జరుగుతుందని తేల్చిచెప్పేశారు. శ్రీనివాస్ చేతుల్లో డబ్బులు లేవు. ఈ సమయంలో చాలా మంది చేతులెత్తేస్తారు. కానీ సక్సెస్ రుచి చూడాలనుకే వాళ్లు మాత్రం సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని అనుకుంటారు. తన బంగారం గొలుసును తాకట్టు పెట్టి, అప్పటికప్పుడు డబ్బులు తెచ్చి, ఆ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు శ్రీనివాస్. ఇంట్లో ఆ విషయం చెప్పలేదు. చాలా కాలం వరకు రోల్డు గోల్డు నెక్లెస్నే వేసుకున్నారు.
“జీవితంలో వచ్చేవి పోయేవి చాలానే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు. కానీ నీ జీవితంలో.. నీ మీద నీకున్న నమ్మకం, నలుగురితో నువ్వు ఉండే తీరు, పంచే ప్రేమ, మాత్రమే శాశ్వతం..” అంటూ తన ఆలోచనలను హిందుస్థాన్ టైమ్స్ తెలుగుతో పంచుకున్నారు శ్రేయాస్ శ్రీనివాస్.
సినిమా తీయడం అంటే చాలా కష్టమైన విషయం. ఆ విషయం తెలిసి కూడా అడుగుపెట్టారు శ్రీనివాస్. 'ఈ రోజుల్లో..' సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్లు జరిగింది. డబ్బులు ఉన్నప్పుడల్లా షూటింగ్ చేసేవారు. కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కాదు. ఎట్టకేలకు సినిమా రెడీ ఆయ్యింది. అప్పటికే శ్రీనివాస్కు చాలా అప్పులు ఉన్నాయి. శాటిలైట్ రైట్స్ సమస్యలు కూడా ఉన్నాయి.
'కష్టపడి చేసిన సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే ఎలా?' అన్న ఆలోచనలో పడ్డ శ్రీనివాస్కు ఓ స్నేహితుడు ధైర్యం చెప్పాడు. 'నీ టాలెంట్ని నమ్ముకో.. నువ్వు సక్సెస్ అవుతావు,' అని భుజం తట్టాడు. శ్రీనివాస్ మనసులో కాస్త ప్రశాంతత. రిలీజ్కి ముందు రోజు ఫోన్ ఆఫ్ చేసి పడుకున్నారు. ఉదయం 10:30కు ఫోన్ ఆన్ చేస్తే.. 'గోకుల్ థియేటర్ దగ్గర ఈ రోజుల్లో సినిమాను బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు,' అని ఫ్రెండ్ ఫోన్ చేశారు. శ్రీనివాస్కు రెట్టింపు ఆనందం లభించింది.
కొవిడ్తో మరో కష్టం ఎదురైంది. సినిమాలు విడుదల కాలేదు. బ్రాండ్ల ప్రొమోషన్లు జరగలేదు. 'ఇది ముగింపు కాదు. మనకి మళ్లీ టైమ్ వస్తుంది,' అని సహనంతో నిరీక్షించారు శ్రీనివాస్. కొవిడ్ తర్వాత సినిమాల ప్రవాహం మొదలైంది. సినిమాలకు.. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలలో క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఇలా జరుగుతుందని ముందే గ్రహించిన శ్రీనివాస్.. అందుకు తగ్గ ఆయుధాలతో సిద్ధమయ్యారు. శ్రేయాస్ మీడియా బ్రాండ్ను మరో శిఖరానికి చేర్చేందుకు వ్యూహాలు రచించారు.
పాన్ ఇండియా ప్రణాళికలు..
Shreyas Srinavas events : ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ప్రజల ఆలోచనా ధోరణ కూడా మారుతోంది. అందుకు తగ్గట్టుగానే శ్రేయాస్ శ్రీనివాస్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పుటివరకు తెలుగు, కర్ణాటకలో ఈవెంట్లు చేయగా.. ఇప్పుడు 'శ్రేయాస్'ను దేశవ్యాప్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దసరా, దీపావళి నాటికి ఇండియా మొత్తం మీద కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
"ఈవెంట్లను ఆల్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాలి. ఇది ఫ్యూచరిస్టిక్ మోడల్. ఒక్కప్పుడు సింగింగ్, డ్యాన్సింగ్ ఉండేవి. ఇప్పుడు అందరి ఆలోచనలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా శ్రేయాస్ కూడా మారుతుంది. దుబాయ్లో లైవ్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తున్నాము. ప్రముఖ సింగర్స్ అందరు పాల్గొంటారు. శ్రేయాస్ మీడియా మ్యూజిక్ అవార్డు కూడా తీసుకొస్తున్నాము. ప్రతి ఏడాది ఆవార్డులు ఇచ్చే విధంగా ప్లాన్ డిజైన్ చేస్తున్నాము. రానున్న ఐదేళ్ల ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. 2027 నాటికి సంస్థ టర్నోవర్ రూ. 1300 కోట్లకు తీసుకెళతాము. 'ఎంటర్టైన్మెంట్ విల్ నెవర్ డై.. ఓన్లీ ది మీడియం విల్ ఛేంజ్' అని తన శైలిలో చెప్పుకొచ్చారు శ్రేయాస్ శ్రీనివాస్.
'శ్రీనివాస్ ఉంటే.. ఇబ్బందులు ఉండవు..'
ఈ ప్రయాణంలో ఎందరినో కలిశారు శ్రీనివాస్. వారందరితోనూ ఆయనకు మంచి స్నేహం ఉంది.
'చిత్రం' సినిమాతో హిట్ కొట్టి, యువతలో ఉదయ్ కిరణ్ మంచి గుర్తింపు పొందిన రోజులు అవి. త్యాగరాయ గాన సభలో ఈవెంట్కు ఆయన్ని పిలుద్దామని శ్రీనివాస్ అనుకున్నారు. వారిద్దరు ఒకప్పుడు 'ట్యూషన్'మేట్స్. శ్రీనివాస్ అంటే ఇష్టంతో నో చెప్పకుండా ఆ ఈవెంట్కు వెళ్లారు ఉదయ్ కిరణ్. అలా తన వ్యక్తిత్వంతోనూ ఎందరి నుంచో ప్రశంసలు పొందారు శ్రేయాస్ శ్రీనివాస్.
ఎల్బీ స్టేడియంలో 'భరత్ అనే నేను' ఈవెంట్ జరిగింది. ఎన్టీఆర్- మహేష్ బాబు ఒకే స్టేజీపై కనిపించారు. ఆ ఈవెంట్కు లక్షలమంది అభిమానులు తరలివెళ్లారు. అంత పెద్ద ఈవెంట్ను చాలా సింపుల్గా పూర్తి చేసి, మహేష్ బాబు ప్రశంసలు అందుకున్నారు శ్రీనివాస్.
Shreyas media group : అల వైకుంఠపురములో ఈవెంట్ సందర్భంగా.. శ్రీనివాస్ గురించి దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తావించారు. 'జల్సా నుంచి శ్రీనివాస్ నాకు తెలుసు. అన్నింటిని సొంత మనిషిలాగా చూసుకుంటారు,' అని అన్నారు.
జీవితంలో కొంత సక్సెస్ కనిపించేసరికి.. 'చాలా సాధించేశాము' అన్న భావనతో ఉంటారు. కానీ అతి తక్కువ కాలంలోనే, సినీ ఇండస్ట్రీలో తనకుంటా ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న శ్రేయాస్ శ్రీనివాస్ మాత్రం.. 'సాధించాల్సింది ఇంకా చాలా ఉంది,' అని అంటున్నారు.
‘నేను ఈవెంట్ చేస్తే కొన్ని వేల మంది భోజనం చేసి కడుపు నింపుకుంటారు. అలా.. లక్షలమందికి నేను ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. ఆ సంకల్పంతోనే పనిచేస్తున్నాను. నిత్యం అన్నదానాలు చేయాలి. అప్పుడే జీవితంలో నేను నిజంగా సక్సెస్ అయినట్టు. నేను దెవుడిని కోరుకునేది కూడా ఇదే,’ అంటున్న 39ఏళ్ల శ్రీనివాస్ లైఫ్ స్టోరీ స్ఫూర్తితో మనం కూడా 'సక్సెస్' అవ్వాలి.. నలుగురికి ఉపయోగపడాలి..!
టాపిక్