తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meghalaya, Nagaland Polling: నేడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: వివరాలివే..

Meghalaya, Nagaland Polling: నేడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: వివరాలివే..

27 February 2023, 7:11 IST

    • Meghalaya, Nagaland Assembly Polling: మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. రెండు రాష్ట్రాల్లో 118 సీట్లకు పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలివే..
Meghalaya, Nagaland Polling: నేడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Meghalaya, Nagaland Polling: నేడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (ANI Photo)

Meghalaya, Nagaland Polling: నేడు రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Meghalaya, Nagaland Assembly Polling: ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం నేడు (ఫిబ్రవరి 27) జరగనుంది. మేఘాలయ (Meghalaya Election), నాగాలాండ్ (Nagaland Election) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మేఘాలయలోని 60 సీట్లకు గాను 59 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. నాగాలాండ్‍లోనూ 59 చోట్ల ఓటింగ్ ఉండనుంది. మేఘాలయలో మళ్లీ అధికారం చేపట్టాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) పట్టుదలగా ఉంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షాలుగా ఉన్నాయి. నాగాలాండ్‍లో తిరిగి పట్టు సాధించాలని అధికార నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP) ప్రయత్నిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 వరకు సాగుతుంది.

మేఘాలయలో ఇలా..

Meghalaya Assembly Election: మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలకు గాను నేడు 59 చోట్ల పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 3,419 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సుమారు 21లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 369 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Meghalaya Assembly Election: మేఘాలయలో 2018 ఎన్నికల్లో అధికార ఎన్‍పీపీ 19 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 21 చోట్ల విజయం సాధించింది. బీజేపీ రెండు చోట్ల, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP) ఆరు సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ అయినా.. యూడీపీ, బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి సీఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‍పీపీ అధికారం చేపట్టింది. అయితే ఈసారి ఎన్‍పీపీ, బీజేపీ పొత్తులు లేకుండానే బరిలోకి దిగాయి. సీఎం సంగ్మా.. సౌత్ తురా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. 2021లో ఏకంగా 12 మంది మేఘాలయ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో తృణమూల్ కూడా ఆ రాష్ట్రంలో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. 58 స్థానాల్లో అభ్యర్థులను టీఎంసీ బరిలోకి దించింది.

నాగాలాండ్‍లో..

Nagaland Assembly Elections: నాగాలాండ్‍లోనూ 60 అసెంబ్లీ స్థానాలకు గాను నేడు 59 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవటంతో అకులుతో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఖజేటో కినిమి ఏకగ్రీవంగా గెలిచారు. దీంతో 59 సీట్లకే పోలింగ్ జరగనుంది. మొత్తంగా 13,17,632 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 2,315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

నాగాలాండ్‍లో అధికార జాతీయ డెమోక్రటివ్ ప్రొగ్రెసివ్ పార్టీ (NDPP) 40 స్థానాల్లో అభ్యర్థులను నిలుపగా.. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ 20 చోట్ల పోటీలో ఉంది. కాంగ్రెస్ 23 స్థానాల్లో దాని మిత్రపక్షం నాగా పీపుల్ ఫ్రంట్ (NPF) 22 చోట్ల పోటీలో ఉంది. ఆర్జేడీ, ఎల్‍జేపీ కూడా పోటీలో ఉన్నాయి. మొత్తంగా 183 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1963 తర్వాత ఆ రాష్ట్రంలో 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు.

మేఘాలయ, నాగాలాంగ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2వ తేదీన జరగనుంది.