LIC IPO | మే 4న ఎల్ఐసీ ఐపీఓ ఓపెన్..!
25 April 2022, 21:55 IST
- దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రంగం సిద్ధమైంది. మే 4న ఎల్ఐసీ ఐపీఓ ఓపెన్ అవ్వనుందని సమాచారం.
ఎల్ఐసీ ఐపీఓ డేట్లు ఇవే…!
LIC IPO date | స్టాక్ మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు, ట్రేడర్లతో పాటు దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీఓ.. మే 4న ఓపెన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
మే 4 నుంచి మే 9 మధ్య ప్రజలు బిడ్లు దాఖలు చేసుకోవచ్చని సమాచారం. మే 2న యాంకర్ బుక్ ఓపెన్ అవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రూ. 21వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా ఎల్ఐసీలోని 3.5శాతం వాటాను విక్రయించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 22కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టనుంది.
వాయిదా మీద వాయిదా..
LIC IPO news | ఎల్ఐసీలో కేంద్రానికి 100శాతం వాటా ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఎల్ఐసీ ఐపీఓను తీసుకొచ్చేందుకు కేంద్రం యోచించింది. వాస్తవానికి గతేడాదే ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది కేంద్రం. మార్చ్లో ఐపీఓను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు సైతం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఫలితంగా మరోమారు ఎల్ఐసీ ఐపీఓ వాయిదా పడింది.
కాగా.. తొలుత 5శాతం వాటా విక్రయించేందుకు కేంద్రం సిద్దపడింది. అంటే సుమారు రూ. 60వేల కోట్లకుపైమాటే. కానీ తాజాగా.. దానిని 3.5శాతానికి కుదించింది. అంటే సుమారు రూ.21వేల కోట్లు. అయినప్పటికీ.. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్రలో నిలిచిపోనుంది.
మే 12లోపు ఎల్ఐసీ ఐపీఓను మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంది. ఆ తేదీ దాటిపోతే మళ్లీ ముసాయిదా పత్రాలను కొత్తగా సమర్పించాల్సి ఉంటుంది. ఈలోపే ఐపీఓను తీసుకొచ్చేందుకు కేంద్రం తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ప్రైజ్ బ్యాండ్పై ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మార్కెట్ వర్గాల ప్రకారం ఎల్ఐసీ ఐపీఓ ప్రైజ్ బ్యాండ్.. రూ .940 నుంచి రూ. 1000 మధ్యలో ఉంటుందని అంచనా.
ఈ పూర్తి వ్యవహారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడే మొత్తం మీద కచ్చితమైన సమాచారం అందరికి అందుతుంది.
టాపిక్