Railways: టికెట్ క్యాన్సిలేషన్ రుసుము ద్వారా గత మూడేళ్లలో రైల్వే ఆదాయం 1200 కోట్లకు పైగానే..
21 March 2024, 15:35 IST
- Indian Railways: క్యాన్సిలేషన్ రుసుము ద్వారా భారతీయ రైల్వే గత మూడేళ్లలో రూ. 1230 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. 2021 నుంచి 2024 వరకు టికెట్ల వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిలేషన్ల ద్వారా ఈ మొత్తం రైల్వేలకు సమకూరింది.
ప్రతీకాత్మక చిత్రం
2021 నుండి టికెట్ల రద్దు (Ticket cancellation) ద్వారా రైల్వేల ఆదాయం పెరుగుతోంది. గత సంవత్సరం దీపావళి పండుగ సమయంలో, ఒక వారంలో, టికెట్ల రద్దు ద్వారా రూ. 10.37 కోట్లను రైల్వే శాఖ సంపాదించింది. ఆ వారంలో, మొత్తం 96.18 లక్షల టిక్కెట్లు, 47.82 వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు రద్దు అయ్యాయి.
మూడేళ్లలో 1230 కోట్లు..
2021లో టికెట్ల రద్దు ద్వారా రైల్వే శాఖ (Railways) రూ. 242.68 కోట్లు ఆర్జించింది. ఆ సంవత్సరం మొత్తం 2.53 కోట్ల వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు రద్దు అయ్యాయి. 2022లో 4.6 కోట్ల టిక్కెట్లు రద్దు కావడంతో ఆదాయం రూ.439.16 కోట్లకు పెరిగింది. 2023లో, 5.26 కోట్ల టిక్కెట్ల రద్దు కారణంగా రైల్వే ఆదాయం రూ. 505 కోట్లకు చేరుకుంది.
ఆర్టీఐ దరఖాస్తు ద్వారా..
మధ్యప్రదేశ్కు చెందిన డాక్టర్ వివేక్ పాండే అనే సమాచార హక్కు కార్యకర్త సమాచార హక్కు చట్టం (RTI Act) ద్వారా ఈ వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తాను తెలుసుకున్న వివరాలను డా. పాండే ట్విటర్ (ఇప్పుడు ఎక్స్) లో పంచుకున్నారు. టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా భారతీయ రైల్వే గణనీయమైన ఆదాయం పొందుతోంది. IRCTC పోర్టల్ ప్రకారం, ప్రయాణ తరగతి ఆధారంగా రద్దు రుసుములు మారుతూ ఉంటాయి. రెండవ తరగతి టికెట్ క్యాన్సిలేషన్ కు రూ. 60 నుంచి AC 1వ తరగతికి రూ. 240 వరకు చార్జీలు ఉంటాయి. ట్రైన్ బయలుదేరడానికిి నాలుగు గంటలలోపు టిక్కెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50% ఉంటుంది. ఒక వేళ . ట్రైన్ బయలుదేరడానికిి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టిక్కెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది.