తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు..

Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు..

12 February 2023, 22:35 IST

    • Rahul Gandhi Gets Privilege Notice: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రివిలేజ్ నోటీసులు జారీ అయ్యాయి. అదానీ అంశం (Adani Row)పై ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు ఈ నోటీసులు వచ్చాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు..
Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు.. (PTI)

Rahul Gandhi: రాహుల్ గాంధీకి నోటీసులు.. ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు..

Rahul Gandhi Gets Privilege Notice: అదానీ గ్రూప్‍ (Adani Group) వివాదం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కుదిపేస్తోంది. అదానీ గ్రూప్‍లో అవకతవకలపై స్పందించాలని అధికార బీజేపీని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్‍బర్గ్ రీసెర్చ్ నివేదికను ఉటంకిస్తూ ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు లోక్‍సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)కి సంబంధం ఉందనేలా కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత వారం లోక్‍సభలో ఫొటోలు చూపిస్తూ మోదీ, అదానీ మధ్య బంధం ఎప్పటి నుంచో కొనసాగుతోందని అన్నారు. మోదీ మద్దతుతోనే అదానీ ఎదిగారని ఆరోపించారు. అయితే ఈ విషయంపైనే ఇప్పుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ అయ్యాయి. లోక్‍సభ సెక్రటేరియట్ ఆదివారం (ఫిబ్రవరి 12) ఆయనకు ప్రివిలేజ్ నోటీసులు పంపింది. పూర్తి వివరాలు ఇవే.

ఎంపీల ఫిర్యాదుతో..

Rahul Gandhi Gets Privilege Notice: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సక్సెస్ వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఈనెల 7వ తేదీన లోక్‍సభలో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. అయితే ఈ విషయంపై లోక్‍సభ స్పీకర్, సెక్రటేరియట్‍కు బీజేపీ ఎంపీలు నిశికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషి ఫిర్యాదులు చేశారు. తప్పుదోవ పట్టించేలా, అవమానకరమైన, అభ్యంతకరమైన రీతిలో రాహుల్ గాంధీ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కంప్లైట్ చేశారు ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలు. దీంతో రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. బుధవారంలోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని లోక్‍సభ్ సెక్రటరీ గడువు విధించారు.

రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

Rahul Gandhi Gets Privilege Notice: బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ వల్లే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగిందని రాహుల్ గాంధీ లోక్‍సభ వేదికగా ఈనెల 7వ తేదీన ఆరోపించారు. తాను చేసిన భారత్ జోడో యాత్రలో అందరూ అదానీ గురించే ప్రశ్నించారని చెప్పారు. “అదానీ సంపద 2014-2022 మధ్య 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు ఎలా పెరిగిందని నన్ను చాలా మంది యువత అడిగారు. 8 నుంచి 10 రంగాలకు అదానీ గ్రూప్ ఎలా విస్తరించిందని ప్రశ్నించారు” అని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ కోసం ప్రభుత్వం చాలా నిబంధనలు మార్చిందని, కాంట్రాక్టులను కట్టబెట్టిందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఈ క్రమంలో ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ.. గతంలో ఓ విమానంలో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను రాహుల్ గాంధీ.. లోక్‍సభలో ప్రదర్శించారు. అదానీ గ్రూప్ సంస్థలకు రుణాలు, కాంటాక్టులు మోదీ ప్రభావం వల్లే వచ్చాయనేలా ఆరోపణలు చేశారు.

తదుపరి వ్యాసం