Adani Row: ‘మౌని బాబా’ అంటూ ప్రధాని మోదీపై ఖర్గే కామెంట్.. 'అదానీ అంశం'పై రాజ్యసభలో రసాభాస
Adani Row in Parliament: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే (Mallikarjun Kharge).. రాజ్యసభలో కామెంట్లు చేశారు. అదానీ సంపద ఎలా పెరిగిందో చెప్పాలంటూ ప్రశ్నలు వేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Adani Row in Parliament: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను అదానీ గ్రూప్ వివాదం కుదిపేస్తోంది. అదానీ గ్రూప్ (Adani Group) పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ అధికార బీజేపీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న వారి పట్ల ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల్లో గౌతమ్ అదానీ (Gautam Adani) సంపద 13 రెట్లు ఎలా పెరిగిందంటూ అడిగారు. ఈ క్రమంలో ‘మౌని బాబా’ (మౌనంగా ఉండే బాబా) అనే పదాన్ని వాడారు. దీంతో రాజ్యసభలో ఒక్కసారిగా దుమారం రేగింది. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇవే.
ట్రెండింగ్ వార్తలు
“అదానీ సంపద ఎలా పెరిగింది”
Adani Row in Parliament: అదానీ గ్రూప్ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే. “2014లో ప్రధాని మోదీ ఓ మాట చెప్పారు. నేను తినను. ఎవరినీ తిననివ్వనని చెప్పారు. కానీ బడా పారిశ్రామిక వేత్తలు తినేందుకు ఆయన అనుమతిస్తున్నారు. ప్రధాని మోదీ ఆప్తమిత్రుడైన ఒకరి సంపద 2.5 సంవత్సరాల్లోనే 13 రెట్లు పెరిగింది. 2014లో రూ.50వేల కోట్లు ఉన్న ఆయన సంపద 2019 నాటికి రూ.లక్ష కోట్లు అయింది. ఆ తర్వాత ఏం మ్యాజిక్ జరిగిందో కానీ.. రెండు సంవత్సరాల్లోనే ఆ పారిశ్రామిక వేత్త సంపద రూ.12లక్షలకు చేరింది” అని ఖర్గే అన్నారు.
‘నిరాధార ఆరోపణలొద్దు’
Adani Row in Parliament: కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరూపణ కాని ఆరోపణలతో చర్చ నడవదని చెప్పారు. నిరాధారణ ఆరోపణలను అనుమతించని అని అన్నారు. సీనియర్ నేత అయిన తమకు ఇలాంటి వ్యాఖ్యలు సూటవ్వవని చైర్మన్ సూచించారు.
‘మాజీ ఆర్థిక మంత్రుల దగ్గర నేర్చుకోండి’
Adani Row in Parliament: ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిరూపణ కానీ సంపద గురించి ఆయన మాట్లాడుతున్నారు. అది షేర్ మార్కెట్ లెక్క. అందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. ఈ వాల్యుయేషన్స్ గురించి మాజీ ఆర్థిక మంత్రుల వద్ద ఆయన నేర్చుకోవాలని సూచిస్తున్నా” అని పియూష్ గోయల్ చెప్పారు.
అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవలకు పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ నివేదిక వెల్లడించినప్పటి నుంచి వివాదం నడుస్తోంది.. ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ దుమారాన్ని రేపుతోంది.
సంబంధిత కథనం