హిజాబ్ తర్వాత కర్ణాటకలో మరో వివాదం.. ఈసారి ‘బైబిల్’
25 April 2022, 15:01 IST
కర్ణాటక: బెంగళూరులోని ఓ స్కూల్లో 'బైబిల్' వివాదం రాజుకుంది. విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం.. బైబిల్ను బలవంతంగా రుద్దుతోందని ఆరోపణలు వస్తున్నాయి. హిజాబ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలో బైబిల్ వివాదం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందేమో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కర్ణాటకలో బైబిల్ వివాదం
Bible controversy Karnataka | హిజాబ్ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలో.. కొత్తగా మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని ఓ పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులపై 'బైబిల్'ను బలవంతంగా రుద్దుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
క్లారెన్స్ హై స్కూల్.. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉంది. విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం బైబిల్ను బలవంతంగా రుద్దుతోందని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది. విద్యార్థులందరు నిత్యం బైబిల్ను బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చే విధంగా స్కూల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా.. రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఓ అధికారి.. పాఠశాలకు వెళ్లి పరిస్థితులపై ఆరా తీశారు.
Karnataka bible issue | బైబిల్ వివాదంపై స్కూల్ ప్రిన్సిపల్ జెర్రి జార్జ్ మాథ్యూ స్పందించారు. 'పాఠశాల విధానాలతో కొందరు అసంతృప్తి చెందారని మాకు తెలిసింది. మేము శాంతి కోసం పాటుపడే మనుషులము. న్యాయపరంగానే పాఠశాలను నడుపుతున్నాము. ఈ విషయంపై మా న్యాయవాదులను సంప్రదించాము. వారి సూచనలను పాటించి.. సరైన నిర్ణయం తీసుకుంటాము. మేము న్యాయాన్ని ధిక్కరించము,' అని పేర్కొన్నారు.
హిజాబ్ కలకలం..
Karnataka hijab row | గతేడాది డిసెంబర్ నుంచి ఏదో ఒక మతపరమైన విషయంతో కర్ణాటక.. నిత్యం వార్తల్లో ఉంటోంది. తొలుత హిజాబ్ వివాదంతో ఆ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. హిజాబ్ వేసుకున్న విద్యార్థినులను పాఠశాలలకు అనుమతించకపోవడంతో వారందరు నిరసనకు దిగారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లింది. ఫలితంగా ఒక్క రాష్ట్రానికే పరిమితమైన హిజాబ్ వివాదం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కొన్ని రోజుల క్రితమే కర్ణాటకలో మరోమారు అలజడులు నెలకొన్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కొన్ని వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రోజుకో కొత్త సమస్య వస్తుండటంతో నేతలు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.