Manjummel Boys Telugu Box Office: తెలుగులోనూ దుమ్ము రేపిన మంజుమ్మల్ బాయ్స్.. ఎంత వసూలు చేసిందంటే?
16 April 2024, 15:51 IST
- Manjummel Boys Telugu Box Office: మలయాళంలో సూపర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీ తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తెలుగులోనూ దుమ్ము రేపిన మంజుమ్మల్ బాయ్స్.. ఎంత వసూలు చేసిందంటే?
Manjummel Boys Telugu Box Office: మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ ఊహించినట్లే తెలుగులోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల మొదట్లోనే తెలుగులోనూ రిలీజైంది. అంతకుముందు తెలుగులో వచ్చిన ప్రేమలు మూవీలాగే ఇప్పుడీ సినిమా కూడా బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది.
మంజుమ్మల్ బాయ్స్ తెలుగు బాక్సాఫీస్
మంజుమ్మల్ బాయ్స్ మూవీ ఏప్రిల్ 6వ తేదీన తెలుగులో రిలీజైంది. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ సర్వైవల్ థ్రిల్లర్ బాగా నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తెలుగులోనూ పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడం కలిసి వచ్చింది.
ఒక్క ఫ్యామిలీ స్టార్ తప్ప కొత్తగా ఏవీ రిలీజ్ కాలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో ఈ మలయాళ డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లకుపైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.
అంతకుముందు 2018 మూవీ పేరుతో ఉన్న రికార్డును మంజుమ్మల్ బాయ్స్ బ్రేక్ చేసింది. అంతేకాదు రూ.200 కోట్ల కలెక్షన్ల మార్క్ అందుకున్న తొలి మలయాళ సినిమా కూడా ఇదే. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగులోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
2006లో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు వెళ్తారు. వాళ్లలో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు అందరూ కలిసి ఎలాంటి సాహసం చేశారన్నదే ఈ సినిమా కథ. మలయాళంతోపాటు తమిళంలోనూ మంచి వసూళ్లు సాధించింది. అక్కడ స్టార్ హీరో సూర్య అత్యధిక వసూళ్లను కూడా ఈ సినిమా దాటేసిందంటే ఏ స్థాయిలో అక్కడి ప్రేక్షకులు ఆదరించారో అర్థం చేసుకోవచ్చు.
మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్
ఇక మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు రిలీజ్ తోపాటు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం మేకర్స్ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా మే 3న డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
డైరెక్టర్ చిదంబరం ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితంగా.. థ్రిల్లింగ్గా ఉండేలా తెరకెక్కించారు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరున్ కురియన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ప్రశంసలను పొందుతోంది.
టాపిక్