Bandi Sanjay Vs Ponnam : బండి సంజయ్ వర్సెస్ పొన్నం, హామీల అమలుపై తారాస్థాయికి మాటల యుద్ధం
28 April 2024, 15:13 IST
- Bandi Sanjay Vs Ponnam : పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బండి సంజయ్ , పొన్నం ప్రభాకర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
బండి సంజయ్ వర్సె్స్ పొన్నం
Bandi Sanjay Vs Ponnam : కరీంనగర్(Karimnagar) లో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఓటర్లను ఆకర్శించే పనిలో ప్రధాన పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. కరీంనగర్ లో కాంగ్రెస్(Congress) బీజేపీ(BJP) మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ రెండు పార్టీల నేతల సవాల్, ప్రతిసవాల్ తోపాటు బహిరంగ చర్చలకు సిద్ధమంటున్నారు.
బండి సంజయ్ అలా?
వందరోజుల్లో ఆరు గ్యారంటీలను(Six Guarantees) అమలు చేసినట్లు నిరూపిస్తే పార్లమెంట్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay Challenges) కాంగ్రెస్ కు బహిరంగ సవాల్ విసిరారు. పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మోసం చేశారు.. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నారు... మహిళలకు తులం బంగారం, స్కూటీతో పాటు నెలనెలా రూ.2500 బ్యాంకులో జమ చేసినట్లు, ఆసరా పెన్షన్లను రూ. 4 వేలు ఇస్తున్నట్లు, ఇల్లులేనోళ్లకు జాగా, రూ.5 లక్షలిస్తున్నట్లు, రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇచ్చినట్లు రుజువు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. లేకుంటే 17 స్థానాల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఈ సవాల్ ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా? అభ్యర్థుల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది. ఆలోపు నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా.. ఎన్నికల్లోపు నిరూపించినా సరే.. దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి...బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా మేనిఫెస్టో(Manifesto) పవిత్రమయ్యిందే అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే నా సవాల్ ను స్వీకరించి ప్రజల ముందు ఆధారాలతో సహా నిరూపించేందుకు డేట్, టైం, వేదిక డిసైడ్ చేయాలన్నారు.
పొన్నం ఇలా?
బండి సంజయ్(Bandi Sanjay) సవాల్ ను మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnama Prabhakar) స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. పదేళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారని ప్రతి సవాల్ విసిరారు. మా సవాల్ ను స్వీకరించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్ని హామీలు అమలు చేశామో చూసుకోవాలన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ(BJP) ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సవాల్ విసురుడు కాదు... స్వీకరించే దమ్ముండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి మండలం బావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు(Velichala Rajender)తో కలిసి రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్(Bandi Sanjay) పై ఫైర్ అయ్యారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు .. కనీసం ఒక్కరి ఖాతాలో అయినా వేశారా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు.. రెట్టింపు చేశారా? రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు..ఇచ్చారా? తెలంగాణ విభజన హామీలు అమలు చేస్తామన్నారు చేశారా? అని బండి సంజయ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని దానిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. అన్ని పనులు చేసిన మేము ప్రతి ఒక్క హామీ అమలు చేశామని తెలిపారు. 10 ఏళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. దేవుడు గుళ్లో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలని కానీ దేవుడి ఫొటోలతో ఓట్లు అడగడం కాదన్నారు పొన్నం ప్రభాకర్.
పసలేని సవాళ్ల..ప్రశ్నించే పనిలో జనాలు
సవాళ్లు విసురుకోవడం బాగానే ఉంది..ఆచరణకు అమలుకు నోచుకోకుండా అందులో ఉన్న కిటుకు అర్థంకాక జనం నేతల మాటలకు కొందరు కరిగిపోతున్నారు. మరికొందరు నిశ్చితంగా ఇద్దరిని నిలదీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వందరోజుల్లో ఆరు గ్యారంటీలన్ని అమలు చేయలేదని కాంగ్రెస్(Congress) నాయకులే బాహాటంగా చెబుతున్నారు. ఆగస్టు 15 లోగా మరికొన్ని అమలు చేస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో బండి సంజయ్ సవాల్ కు అర్థం ఏముంటుంది?. ఇక బీజేపీ(BJP) ఇప్పటికి రాష్ట్ర విభజన హామీలతోపాటు ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు పెన్షన్(Pensions) అమలుకావడంలేదని అందరికి తెలిసిన విషయమే, మరీ పొన్నం సవాల్ కు ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది. మాటలతో గారడి చేసి నాలుగు ఓట్లు సంపాధించుకోవాలనుకునే నేతల మాటలు ఎన్నికల వేళ ఇలానే ఉంటాయని జనం ఉసూరమంటున్నారు.
HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR