Team India: ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టులకు టీమ్ ఇదే.. రాహుల్, జడేజా వచ్చారు కానీ..
10 February 2024, 12:17 IST
- Team India: ఇంగ్లండ్ తో జరగబోయే చివరి మూడు టెస్టులకు టీమిండియాను సెలెక్టర్లు బీసీసీఐ శనివారం (ఫిబ్రవరి 10) అనౌన్స్ చేశారు. ఊహించినట్లే విరాట్ కోహ్లి అందుబాటులో లేకపోగా.. కేఎల్ రాహుల్, జడేజా తిరిగి వచ్చారు.
ఇంగ్లండ్తో మూడు టెస్టులకు కోహ్లి దూరం కాగా బుమ్రా జట్టులోనే ఉన్నాడు
Team India: గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కీలకమైన ప్లేయర్స్ అందుబాటులో ఉంటారో లేదో అన్న సందేహాల మధ్య మొత్తానికి ఆలస్యంగా అయినా ఇంగ్లండ్ తో చివరి మూడు టెస్టులకు టీమిండియాను అనౌన్స్ చేశారు. ఊహించినట్లే ఈ సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లి అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆడటం లేదని, అతని నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని బీసీసీఐ చెప్పింది. కేఎల్ రాహుల్, జడేజా తిరిగి వచ్చినా.. వాళ్ల ఫిట్నెస్ క్లియరెన్స్ తర్వాతే తుది జట్టులోకి రానున్నారు.
శ్రేయస్ లేడు.. ఆకాశ్దీప్ వచ్చాడు
ఇంగ్లండ్ తో చివరి మూడు టెస్టులకు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు. మరోవైపు పేస్ బౌలర్ అవేష్ ఖాన్ స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకున్నారు. రెండో టెస్టుకు దూరమైన మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయాలతో రెండో టెస్టు ఆడని కేఎల్ రాహుల్, జడేజాలను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. కానీ వాళ్ల మూడో టెస్ట్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధిస్తేనే తుది జట్టులోకి వస్తారు.
రెండో టెస్టు కోసం జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ లు తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో ఈ ఇద్దరినీ కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. ఈ మూడు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో జట్టును అనౌన్స్ చేశారు. అయితే అయ్యర్ గాయం గురించి మాత్రం బీసీసీఐ ఒక్క మాట కూడా చెప్పలేదు.
అవేష్ ఖాన్ ను రంజీ ట్రోఫీ కోసం నేషనల్ టీమ్ నుంచి రిలీజ్ చేశారు. మరోవైపు యువ బెంగాల్ పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ కు అవకాశం కల్పించడం విశేషం. భవిష్యత్తు కోసం అతన్ని సిద్ధం చేయడానికి నేషనల్ టీమ్ లోకి తీసుకున్నారు. బుమ్రా ఆడతాడా లేదా అన్న సందేహాలకు చెక్ పెడుతూ.. మిగిలిన మూడు టెస్టులకు అతన్ని తీసుకోవడమే కాదు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇవ్వడం గమనార్హం.
ఇంగ్లండ్ తో మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత నాలుగో టెస్టు ధర్మశాలలో, ఐదో టెస్టు రాంచీలో జరగనున్నాయి. రెండు టెస్టుల్లో చెరొక మ్యాచ్ గెలిచి ఇండియా, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగులతో గెలవగా.. విశాఖపట్నంలో ఇండియా 106 పరుగులతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. మూడో టెస్టులో గెలిచి సిరీస్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మిగిలిన మూడు టెస్టులకు టీమ్ ఇదే
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్
టాపిక్