Team India: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. విదేశాలకు కోహ్లి, జడేజాకు తీవ్రమైన గాయం!
02 February 2024, 7:22 IST
- Team India: ఇంగ్లండ్ తో రెండో టెస్ట్ ఆడబోయే ముందు టీమిండియాకు మరింత బ్యాడ్ న్యూస్ వస్తోంది. విరాట్ కోహ్లి విదేశాలకు వెళ్లడం, రవీంద్ర జడేజా గాయం తీవ్రత అనుకున్న దాని కంటే ఎక్కువే ఉండటం ఆందోళన కలిగిస్తోంది
రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి
Team India: ఇంగ్లండ్ చేతుల్లో తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిన టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్. ఇప్పటికే తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి మూడో టెస్టు ఆడేది కూడా అనుమానంగా మారింది. అటు గాయంతో రెండో టెస్టుకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజాకు గాయం తీవ్రత ఊహించినదాని కంటే ఎక్కువే ఉన్నట్లు తేలింది.
విరాట్ కోహ్లి విదేశాలకు..
ఇంగ్లండ్ తో సిరీస్ ప్రారంభానికి మూడు రోజుల ముందు తొలి రెండు టెస్టుల నుంచి వ్యక్తిగత కారణాల కారణంగా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చెప్పడం షాక్ కు గురి చేసింది. అతని తల్లి ఆరోగ్యం బాగా లేనందుకే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడన్న వార్తలు వచ్చినా.. అది నిజం కాదని అతని సోదరుడు స్పష్టం చేశాడు. కానీ తాజాగా కోహ్లి విదేశాలకు వెళ్లాడన్న వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలు దేశంలోనే లేని విరాట్.. మూడో టెస్ట్ సమయానికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారినట్లు క్రిక్బజ్ రిపోర్టు వెల్లడించింది. నిజానికి రెండో టెస్ట్ ముగిసిన 9 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 15న మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. కానీ ఆలోపు కూడా కోహ్లి టీమ్ తో చేరతాడా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తోంది.
జడేజా గాయం సంగతేంటి?
మరోవైపు తొలి టెస్ట్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన రవీంద్ర జడేజా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలో ఉన్నాడు. అయితే అతని గాయం తీవ్రత అనుకున్నదాని కంటే ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ముందుగా భావించినా.. ఇప్పుడు మూడు కాదు కదా నాలుగో టెస్టుకూ అనుమానమే అనే వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్య తరచూ గాయాలతో టీమ్ కు దూరమవుతున్న జడ్డూ ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జట్టులోకి వచ్చినప్పుడు మ్యాచ్ విన్నర్ గానే ఉంటున్నా.. గాయాల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలవడంతోపాటు బౌలింగ్ లోనూ రాణించిన జడేజా.. మరో రెండు టెస్టులకు దూరం కావడం టీమ్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావం చేస్తుంది.
మహ్మద్ షమి కోలుకున్నాడా?
ఇక వరల్డ్ కప్ తర్వాత మడమ గాయం కారణంగా మళ్లీ కనిపించని మహ్మద్ షమి పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం అతడు లండన్ లో చికిత్స పొందుతున్నాడు. ఇంజెక్షన్లతో కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. సర్జరీ కూడా అవసరం కావచ్చు.
ఈ టెస్ట్ సిరీస్ కు అతడు ఎలాగూ అందుబాటులో ఉండడు. ఐపీఎల్ సమయానికి కోలుకోవచ్చని భావిస్తున్నారు. కేఎల్ రాహుల్ మాత్రమే మూడో టెస్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుడి తొడ కండరాల్లో నొప్పి అని చెప్పిన రాహుల్ ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు.