Sri Lanka Cricket: వరల్డ్ కప్లో చెత్త ప్రదర్శన.. మొత్తం శ్రీలంక క్రికెట్ బోర్డుపైనే వేటు
06 November 2023, 11:56 IST
- Sri Lanka Cricket: వరల్డ్ కప్లో చెత్త ప్రదర్శన కారణంగా మొత్తం శ్రీలంక క్రికెట్ బోర్డుపైనే వేటు వేశారు ఆ దేశ క్రీడల శాఖ మంత్రి రోషన్ రణసింఘె. ఇండియా చేతుల్లో అవమానకర ఓటమి తర్వాత సోమవారం (నవంబర్ 6) ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
శ్రీలంక క్రికెట్ టీమ్
Sri Lanka Cricket: శ్రీలంక క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ 2023లో దారుణమైన ఆటతీరుతో సెమీఫైనల్ ఆశలను దాదాపు వదిలేసుకుంది. ముఖ్యంగా ఇండియా చేతుల్లో కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఏకంగా 302 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ దేశ క్రీడల శాఖ మంత్రి రోషన్ రణసింఘె కఠిన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం శ్రీలంక క్రికెట్ బోర్డుపైనే వేటు వేశారు.
కొన్నాళ్లుగా శ్రీలంక క్రికెట్ బోర్డుపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు రోషన్ రణసింఘె. ఇప్పుడు టీమ్ చెత్త ప్రదర్శనతో బోర్డును తప్పించారు. తాత్కాలిక బోర్డు ఛైర్మన్ గా 1996లో వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక టీమ్ కెప్టెన్ అర్జున రణతుంగను నియమించారు. ఈ కొత్త బోర్డులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితోపాటు మాజీ బోర్డు ప్రెసిడెంట్ కూడా ఉంటారని క్రీడల మంత్రి కార్యాలయం వెల్లడించింది.
టీమిండియా చేతుల్లో ఓటమి తర్వాత శ్రీలంక బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా పదవి నుంచి తప్పుకున్నారు. ఆ మరుసటి రోజే రణసింఘె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నిజానికి ఈ ఓటమి తర్వాత బోర్డు సభ్యులంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా సభ్యులు వినకపోవడంతో మొత్తం బోర్డునే రద్దు చేశారు.
సోమవారం (నవంబర్ 6) బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడటానికి ముందే శ్రీలంక టీమ్ కు ఈ షాకింగ్ వార్త తెలిసింది. బోర్డు సభ్యులంతా పూర్తి అవినీతిపరులని రణసింఘె విమర్శిస్తున్నారు. నిజానికి శనివారమే రణసింఘె శ్రీలంక బోర్డు సభ్యులపై ఫిర్యాదు చేస్తూ ఐసీసీకి లేఖ రాశారు. అందులో బోర్డు సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలూ ఉన్నాయని చెప్పడం గమనార్హం.
క్రికెట్ బోర్డుల్లో రాజకీయ జోక్యం ఉండకూడదనే ఐసీసీ.. రణసింఘె లేఖపై స్పందించలేదు. ఈ ఏడాది మే నెలలో శ్రీలంక బోర్డును ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా నియమితులయ్యారు. శ్రీలంక క్రికెట్ ప్రమాణాలు దిగజారడం వల్లే 1996 తర్వాత మళ్లీ ఆ టీమ్ వరల్డ్ కప్ గెలవలేకపోయిందని రణసింఘె ఆరోపిస్తున్నారు.
టాపిక్